సాత్యకి చక్రవర్తి
పదేళ్లపాటు 1954 వరకు ప్రజాస్వామ్య వసంతం పూచింది. ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన తొలి అధ్యక్ష ఎన్నికల్లో జోస్ అరెవలో (బెర్నార్డో అరెవలో తండ్రి) ఎన్నికయ్యాడు. రివల్యూషనరీ యాక్షన్ పార్టీ ఆరేళ్లు పరిపాలించింది. అది ప్రజారాజకీయాలను సరళతరం చేసింది. కార్మికసవరణచట్టాలు చేసింది. రాజ్యాంగం ఆమోదించింది. అరెవలో తన తాత్వికతను ‘ఆధ్యాత్మిక సోషలిజం’ అన్నారు. అతని పాలన కాలంలో విదేశీ, స్వదేశీ భూస్వాముల నుండి 14 లక్షల ఎకరాలు స్వాధీనం చేసి భూమిలేని పేద రైతులకు పంచారు. ఇది అమెరికన్ కంపెనీలను దెబ్బకొట్టింది.
మధ్య అమెరికా దేశం గ్వాటెమాలలో సామాన్య ప్రజలకు ఎట్టకేలకు ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. ఈ దేశంలో అధ్యక్ష ఎన్నికలకు రన్ఆఫ్ పోలింగ్ ఆగస్టు 20న జరుగనుంది. షెడ్యూలు ఎన్నికల్లో అధ్యక్ష పోటీలోని అభ్యర్థుల్లో ఎవరికీ పోలైన ఓట్లలో 50శాతంపైగా లభించనట్లయితే, తొలి రెండు స్థానాల్లోని ఇరువురు అభ్యర్థులతో మళ్లీ పోలింగ్ నిర్వహించే పద్ధతినే రన్ఆఫ్ ఎన్నికలంటారు. ఇది లాటిన్, మధ్య అమెరికా ఖండం దేశాల రాజ్యాంగాల్లో నియమంగా ఉంది. జూన్ 25న అధ్యక్ష ఎన్నికల్లో పచ్చిమిత వాద అభ్యర్థి శాండ్రా టార్రెస్కు 15శాతం ఓట్లు లభించగా, సెంటర్
లెఫ్ట్ పార్టీ వామపక్షం వైపు మొగ్గుదల ఉన్న మధ్యేవాద పార్టీ సెమిల్లా అభ్యర్థి బెర్నార్డో అరెవలో ఆశ్చర్యకరంగా 12శాతం ఓట్లతో రెండవ స్థానం పొందాడు. ఇప్పుడు వారిద్దరూ తుది రౌండ్లో అధ్యక్ష పదవికి పోటీపడు తున్నారు. 160 మంది సభ్యులతో కూడిన డిప్యూటీల ఛాంబర్కు కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి.
గతకాలం ఎన్నికల్లో సెమిల్లా నాయకత్వంలోని అరెవలోకు 3శాతం లోపే ఓట్లు వచ్చాయి. తొలి ఏడుగురు అభ్యర్థుల్లో కూడా లేడు. అయితే ఈ పర్యాయం తొలి రౌండ్ పోలింగ్కు వారాల ముందు అవినీతికర, ప్రజా వ్యతిరేకప్రభుత్వాన్ని నిరసిస్తూ అనేకవిభాగాల ప్రజలు పెద్దఎత్తున ప్రదర్శనలు జరిపారు. మితవాద అభ్యర్థి శాండ్రా టొర్రెస్ మాజీ ప్రథమ మహిళ. అంటే మాజీ అధ్యక్షుని భార్య. ఇప్పుడామె యుఎన్ఇ (నేషనల్ యూనిటీ ఫర్ హోప్) అభ్యర్థి. మితవాద మీడియా, పాలకపార్టీ ఆమె ప్రత్యర్థి సెమిల్లా పార్టీ నేతను కమ్యూనిస్టు అని ఆరోపిస్తుండేది. ఆయన కానేకాదు అయితే ఆయన పార్టీ మితవాదుల యథాతధవాదానికి దూరం. గ్యాటెమాలను దీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న శక్తులను సెమిల్లా సవాలుచేస్తున్నది. ప్రభుత్వ విద్యపై వేలకోట్లు వెచ్చిస్తామని, అంతిమంగా అందరికీ ఉచిత వైద్యం లక్ష్యంగా ప్రభుత్వ వైద్య వసతులను పటిష్టం చేస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నది. అరెవలో కార్యక్రమాలు ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు లులా విధానాలను పోలి ఉన్నాయి. చైనా ప్రజారిపబ్లిక్ దౌత్య, ఆర్థిక సంబంధాలను అరెవలో కోరుకుంటున్నాడు. తైవాన్ (తైపే)ను ప్రధాన చైనాలో భాగంగా గుర్తిస్తున్న బహుకొద్ది దేశాలలో గ్వాటెమాల ఒకటి. గ్వాటెమాలలో అమెరికాకు చెందిన బడా బహుళజాతి కార్పొరేషన్ల అధికారాన్ని తగ్గించే నిమిత్తం కొన్ని కీలకమైన ప్రకృతి వనరులపై ప్రభుత్వ నియంత్రణను కోరుకుంటున్నాడు. నియంతృత్వ పాలన, అటు తర్వాత పచ్చి మితవాదుల పాలనాకాలంలో గ్వాటెమాల విదేశాంగ విధానం అమెరికా ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తేవిగా ఉంది. సెమిల్లా నాయకుడు దాన్ని తప్పక వ్యతిరేకిస్తాడు. అయితే సెమిల్లా ప్రజలను కూడగడుతూ ఉండే బహుళజాతి కార్పొరేషన్లు, గుత్తపెట్టుబడి కూటములు చూస్తూ ఊరుకుంటాయా? జూన్ 25 తొలి రౌండ్ తదుపరి ప్రతిపక్షపార్టీకి అనుకూలంగా కనిపిస్తున్న ఉత్సాహాన్ని దెబ్బతీయడానికి అవి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు తొలి రౌండ్ బ్యాలెట్లను పున:పరిశీలించాలని గ్వాటెమాల ఉన్నత న్యాయస్థానం జులై 1న ఆదేశించింది. గ్వాటెమాల ఎన్నికల ట్రిబ్యునల్ (టిఎస్ఇ) అంతిమంగా ఎన్నికలను సర్టిఫై చేసింది. అయితే మితవాదుల దాడి అంతటితో ఆగలేదు. సెమిల్లా దగాకు పాల్పడిరదని ఆరోపిస్తూ, అందువల్ల ఆ పార్టీకి ‘అనర్హత’ విధిస్తున్నట్లు స్పెషల్ ప్రాసిక్యూటర్ ఆఫీసు కొత్త అధిపతి జులై 12న ప్రకటించాడు. అయితే ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనా, ఫలితాలు ప్రకటించే వరకు ఏ పార్టీని సస్పెండ్ చేయరాదని
టిఎస్ఇ ఆర్టికల్ 92 చెబుతున్నందున అరెవలోను సస్పెండ్చేసిన, ప్రాసిక్యూటర్ ఉత్తర్వును టిఎస్ఇ తోసిపుచ్చింది. అయితే పబ్లిక్ మంత్రిత్వశాఖ మితవాద మంత్రి ఇంతవరకు ఆ ఎన్నికల ఫలితాలను సర్టిఫై చేయలేదు. ప్రజాస్వామ్యం పట్ల పాలకవర్గాల ఏవగింపును ఇది తెలియజేస్తుంది. ఇందుకు నిరసనగా వేలాదిమంది ప్రదర్శనలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను సర్టిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రన్ఆఫ్ సమీపిస్తున్న కొలదీ ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించాలని అరెవలో మద్దతుదారులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గత శతాబ్దంలో గ్వాటెమాల ప్రజాస్వామ్య చరిత్ర అల్లకల్లోలం. 1931 నుంచి 1944 వరకు పరిపాలించిన నియంత జుర్గె యుబికోను 1944లో పట్టణ, గ్రామీణ శ్రామికులకూటమి పదవీచ్యుతుణ్ణి చేసింది. దీన్ని ‘గ్వాటెమాల అక్టోబరు విప్లవం’ అన్నారు. పదేళ్లపాటు 1954 వరకు ప్రజాస్వామ్య వసంతం పూచింది. ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన తొలి అధ్యక్ష ఎన్నికల్లో జోస్ అరెవలో (బెర్నార్డో అరెవలో తండ్రి) ఎన్నికయ్యాడు. రివల్యూషనరీ యాక్షన్ పార్టీ ఆరేళ్లు పరిపాలించింది. అది ప్రజారాజకీయాలను సరళతరం చేసింది. కార్మికసవరణచట్టాలు చేసింది. రాజ్యాంగం ఆమోదించింది. అరెవలో తన తాత్వికతను ‘ఆధ్యాత్మిక సోషలిజం’ అన్నారు. అతని పాలన కాలంలో విదేశీ, స్వదేశీ భూస్వాముల నుండి 14 లక్షల ఎకరాలు స్వాధీనం చేసి భూమిలేని పేద రైతులకు పంచారు. ఇది అమెరికన్ కంపెనీలను దెబ్బకొట్టింది. అమెరికన్ ఎంఎన్సీలు, స్థానిక మితవాదులతో కలిసి కుట్రపన్ని సిఐఏ సహాయంతో ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. అధికారం చేపట్టిన మితవాద ప్రభుత్వం అరెవలో ప్రభుత్వ పురోగామి చర్యలన్నింటినీ వెనక్కి తీసుకుంది. అది గత శతాబ్దం 90వ దశకం చివరివరకు కొనసాగింది. 1996 నంచి 2023 వరకు గ్వాటెమాల రాజకీయాల్లో మితవాదులు, పెట్టుబడిదారులదే ఆధిపత్యం. కాగా, ఆధ్యక్షుడు ఒట్టో పెరెజ్ మోలినా దేశాన్ని కోట్లాది డాలర్లకు దగాచేసిన కేసులో అతని అరెస్టుకు వారెంటు జారీ కావడంతో అతడు 2015, సెప్టెంబరు 15న రాజీనామా చేశాడు. అంతర్యుద్ధకాలంలో 1982
83 వేలాదిమందిని సామూహికంగా హతమార్చిన భూదగ్ధమిలిటరీ ఎత్తుగడల్లో కూడా అతడు భాగస్వామి.
గ్వాటెమాల పేదలు 1954నుండి తొలిసారి ఆగస్టు 20 ఎన్నికలవైపు ఆశాభావంతో ఉన్నారు. కమ్యూనిస్టుపార్టీ సహా సామాజిక గ్రూపులన్నీ గత శతాబ్దంలో పేదలకు అనుకూలంగా పరిపాలన అందించిన ప్రధానమంత్రి కుమారునికి తోడ్పాటు ప్రకటించాయి. అరెవలో విజయం కొరకు ట్రేడ్ యూనియన్లు పనిచేస్తున్నాయి. ప్రచారం అప్పుడే తారాస్థాయికి చేరింది. అనేకమంది పాత్రికేయులు అరెవలో విజయావకాశాలకు చూస్తున్నారు. అయితే మితవాదులు, వారి కంట్రోలులోని పాలనా యంత్రాంగం స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికల నిర్వహణను అనుమతిస్తాయా అన్నదే పెద్దప్రశ్న.