మల్లుల సీతారాం ప్రసాద్
కార్య దీక్షాపరుడు, తీర ప్రాంత భూపోరాట యోధుడు నాగిడి సాంబమూర్తి. భారత కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఆయన పేరు వింటేనే ఆ రోజుల్లో భూస్వాముల గుండెల్లో హడల్. సుమారు నాలుగువేల ఎకరాల బంజరు భూములను ఆక్రమించి తీరప్రాంత ప్రజానీకానికి పంపిణీచేయడంలో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. నిరుపేద మత్స్యకార కుటుంబంలో జన్మించిన ఆయన 1947 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు. అప్పటికే సాధువుగా ఆయన ఈ ప్రాంతం అంతటికి పరిచితులు. 1948లో కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించి తదుపరి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించారనే నెపంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేసి మచిలీపట్నం జైలుకు తరలించి చిత్రహింసలకు గురి చేశారు. 1959లో ది నాగిడి పాలెం ఫిషర్ మాన్ఫీల్డ్ లేబర్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీకి దీర్ఘకాలం అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సొసైటీ ద్వారా వేలాది అటవీ బంజరు భూమిని సీపీఐ నాయకత్వంలో ఆక్రమించి డిఫారెస్టు చేయించి ఈ ప్రాంత ప్రజానీకానికి పంచారు. సాంబమూర్తి ఉద్యమానికి నాటి సీపీఐ శాసనసభ్యులు వంక సత్యనారాయణ పూర్తి సహకారం అందించారు. ఈ బంజరు పోరాటం ద్వారా నాగిడిపాలెం, బర్రెవానిపేట, దొంగపిండి, కొత్తపూలమర్రు, నాగేంద్రపురం, తోకతిప్ప మోడీ, కలువపూడి, బొండాడలంక, అనాకోడేరు, చల్లపల్లి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరింది. ఇదేవిధంగా గొల్లవానితిప్ప గ్రామంలో ఉన్న సీఏడీ భూమిని పేదలకు పంచాలని పెద్ద ఉద్యమమే నిర్వహించారు. 1970 ప్రాంతంలో కాళీపట్నం జమీందారుతో పోరాడి ఆనాటి శాసనమండలి సభ్యులు, రైతు సంఘం నాయకులు వైవీ కృష్ణారావు సహాయంతో కాళీపట్నం మెయిన్ కాలువ నుంచి నాగిడిపాలెం వరకు పంట కాలువ ఏర్పాటు చేయించారు. ఈ ప్రాంతంలో కోస్తా కారిడార్ అభివృద్ధి కావాలనే ధ్యేయంతో సముద్ర ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలించాలంటే కోస్తా కారిడార్ అవసరమని చాలా కాలం క్రితమే ఒక రూట్ మ్యాప్ను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. ఆయన కృషి మూలంగా నాగిడిపాలెం లోసరి బ్రిడ్జిలు నిర్మాణమయ్యాయి. పాతపాడు, లక్ష్మీపురం వద్ద స్ట్రైట్ కట్ నిర్మాణం చేయించడానికి, అదే సమయంలో వచ్చిన వరదలు మూలంగా ఈ ప్రాంత ప్రజలను పరామర్శించడానికి నాటి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీని, నాటి సీపీిఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరావుని, ఆనాటి భీమవరం శాసనసభ్యులు సుభాశ్ చంద్రబోస్ని బోటుల ద్వారా తీసుకువచ్చారు. 1968లో కృష్ణ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధాన వ్యాపార కేంద్రమైన పాతపాడు ఎండు చేపల మార్కెట్ అభివృద్ధికి షెడ్లు నిర్మాణం చేయించారు. ఆనాటి సీపీిఐ శాసనమండలి సభ్యులు కోండ్రు సుబ్బారావు నాయకత్వంలో షెడ్లు నిర్మించే వరకు పనులు చెల్లించరాదని నిరాకరణ ఉద్యమం కూడా చేశారు. నాగిడిపాలెం గ్రామ సర్పంచ్గా రెండు దఫాలు ప్రజలకు సేవలు అందించారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కోసం విశేషంగా కృషిచేశారు. సాగునీరు తాగునీరు, విద్యా, వైద్యం రోడ్లు వంతెనలు, నాగిడిపాలెం వద్ద మందచేడుపై సెట్రస్ ఏర్పాటు చేయించారు. 1978వ సంవత్సరంలో నాగిడి సాంబమూర్తి చేస్తున్న ఉద్యమాలకు, పోరాటాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆయనపై దాడులకు ప్రయత్నించారు. కొలతలకని పిలిచి భూస్వాములు ఆయనపై భౌతిక దాడికి దిగి హత్యాయత్నం చేశారు. ఆయన మనోధైర్యంతో చిన్ననాడు నేర్చుకున్న యోగ విద్య ద్వారా కోలుకున్నారు. భూ పోరాటాలకు సాంబమూర్తి ఊపిరి లాంటివాడు. ఆయన తీర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడలేదు. తూర్పు, పశ్చిమ కృష్ణ్ణా జిల్లాలకు చెందిన ఆనాటి రెవెన్యూ జీవోలు ఆయా కార్యాలయాల కంటే ముందుగా సాంబమూర్తికి చేరేవి. ఆయన ఇల్లు ఒక రెవెన్యూ కార్యాలయంలా ఉండేది. పెద్ద పెద్ద అధికారులు సైతం ఆయనను అడిగి ఆ జీవోలు తీసుకునేవారు. తీర ప్రాంత ప్రజలను కమ్యూనిస్టు పార్టీ వైపు మళ్లించడంలో, ప్రజా సంఘాల ద్వారా ఉద్యమాలు చేయించడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హైదరాబాద్, దిల్లీలో ఈ ప్రాంతపు పనులు చేయించడానికి తనదైన శైలిలో అడ్డంకులను అధిగమించి పనులు పూర్తి చేసేవారు. సాంబమూర్తి పోరాటశైలి ఈ ప్రాంతానికే కాదు జిల్లా, రాష్ట్ర ప్రజానికానికే ఆదర్శం. నేటి యువత సాంబమూర్తి పోరాట స్ఫూర్తిని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి. వృద్ధాప్యంతో 2003 డిసెంబరు 17న సాంబమూర్తి కన్నుమూశారు.
(శనివారం నాగిడి పాలెం గ్రామంలో నాగిడి సాంబమూర్తి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా) సీపీిఐ భీమవరం రూరల్ మండలం కార్యదర్శి