సురవరం సుధాకరరెడ్డి
విశాలాంధ్ర దినపత్రిక 1952లో విజయవాడ నుంచి ప్రారంభమైంది. బహుశా కోస్తాంధ్ర రాయలసీమతో కలిసి ఉన్న ఆనాటి ఆంధ్రరాష్ట్రంలో ప్రారంభమైన తొలి తెలుగు దినపత్రిక ఇదే. కొన్ని దినపత్రికలు ఉన్నా అవి నికరంగా నడవలేదు. 72 ఏళ్ల నుంచి నిరాఘాటంగా నడుస్తున్న మొదటి తెలుగు దిన పత్రిక విశాలాంధ్ర మాత్రమే. ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ మద్రాసు నుంచి రైళ్లలో మధ్యాహ్నానికి కానీ వచ్చేవి కావు. కమ్యూనిస్టు పార్టీ చొరవతో పార్టీ నాయకులు, సభ్యుల విరాళాలతో, షేర్లతో ప్రారంభమైన ప్పటికీ ‘‘జాతీయ తెలుగు దినపత్రిక’’ గా ప్రకటించుకుంది. అలాగే అన్ని వార్తలు ప్రచురించ ేవారు. ముఖ్యంగా శ్రమజీవుల, రైతుల, ఉద్యోగుల తదితర వర్గాల ప్రతినిధిగా గత ఏడు దశాబ్దాలుగా విశాలాంధ్ర తన ప్రస్థానం కొనసాగిస్తోంది.
మునిసిపల్ కార్మికులు, ప్రెస్ వర్కర్లు, మోటారు వాహన కార్మికులు సమ్మె చేస్తే, ఎన్జీఓలు సమ్మెచేస్తే, స్వర్ణకారులు సమ్మెచేస్తే, రైతులు సత్యాగ్రహం చేస్తే, విద్యార్థులు పోరాటాలు చేస్తే విశాలాంధ్రలో ప్రధాన బ్యానర్లుగా వార్తలు వచ్చేవి. వస్తున్నాయి. దిక్కు, మొక్కు లేని దీనుల గొంతుకగా విశాలాంధ్ర నిలిచింది. బలహీనవర్గాలు, గిరిజనులు, దళితలపై అత్యాచారాలను, దాడులను బహిర్గతపరిచి బాధితులకు అండగా నిలిచింది. భూస్వాములు, వ్యాపారవర్గాల దోపిడీని ఎండగట్టింది. అధికారుల అవినీతిని బహిర్గతం చేసింది. అధికార పార్టీల నాయకుల మోసాలను బైటపెట్టింది. ప్రజలకు నిజాలు చెప్పింది. రాజనీతి నేర్పింది. పతిఘటనను, పోరాటాన్ని విశాలాంధ్ర నేర్పింది. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం పోరాటాలకు వేదికైంది. వర్గపోరాటాలకు దారిచూపే కాగడాగా ముందు నిలిచింది విశాలాంధ్ర.పత్రికలో వార్తా సమాచారం అందించడమే కాదు, ప్రజల సమస్యలపై పోరాడే చైతన్య దీపికగా విశాలాంధ్ర నిలిచింది. విశాలాంధ్ర ప్రచురణాలయం అద్భుత సాహిత్యసేవ చేసింది. ప్రగతిశీల సాహిత్యాన్ని, విప్లవ సాహిత్యాన్ని ప్రచురించి, రాష్ట్రమంతటా పంపిణీ చేసింది. గురజాడ, కందుకూరి సాహిత్యాలను మరోసారి ప్రజల ముందుకు తెచ్చింది.నేను హైస్కూలు విద్యార్థిగా ఉండగానే విశాలాంధ్ర చదవడం ప్రారంభమైంది. అప్పట్లో నాకు గుర్తున్నంతవరకు విశాలాంధ్ర దినపత్రిక వెల ఒక అణా. పత్రిక దొరకకపోతే రోజూ పత్రిక రాగానే కొనుక్కొని దాచుకునే హోటల్ కార్మిక మిత్రుడి గదికి వెళ్లి చదువుకునే వాళ్లం. పత్రిక అనేక ఆటుపోట్లకు గురైంది. ప్రకటనలు ఆపేశారు. ప్రభుత్వ ప్రకటనలు కూడా అనేకసార్లు ఆపారు. న్యూస్ప్రింట్, ఇంక్ అన్నింటి ధరలు పెరిగాయి. నూతన పత్రికలు అనేక ఆకర్షణలతో ప్రారంభమై పోటీలో ముందుకుపోయాయి. అయినా కార్యకర్తలు, ప్రజలు పత్రికను బతికించుకున్నారు. అనేక ఎడిషన్లు ప్రచురిస్తున్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితికి కార్యదర్శిగా, అధ్యక్షుడుగా పనిచేసే సదవకాశం నాకు కలిగింది. కాని నా సుదీర్ఘ అనుభవం పాఠకుడిగానే అప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నది. మద్దుకూరి చంద్రశేఖరరావు నుంచి ఆర్వీ రామారావ్ దాకా గొప్ప సంపాదకులందరూ పత్రికను తీర్చిదిద్దారు. విశాలాంధ్రకు వయసు లేదు. వృద్ధాప్యం లేదు. శ్రామిక ప్రజల పోరాటాల పతాకగా సాగిపోతోంది.
వర్థిల్లాలి విశాలాంధ్ర!