పిలిచేందుకు ఏ పేరైతే ఏముందిలే అని ఎవరనుకుంటారు? ముఖ్యంగా రాజకీయ పార్టీలు..! తాము అధికారంలోకి రాగానే తమ పాలనలో పథకాలకు, సంస్థలకు, నిర్మాణాలకు క్షణం ఆగకుండా పేరు మార్చేస్తారు. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మేమెందుకు ఉంచాలంటూ ముందుగా చేసే పని అదే..! పేర్లపై తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు. అవి కొన్నిసార్లు వికటిస్తాయి కూడా. పేర్లు మార్చడం సరేకానీ… పథకం అమలులో కూడా చిత్తశుద్ధి చూపించాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా పథకాలకు పేర్లు మార్చినా మూడుపేర్ల మార్పు తీవ్ర చర్చకు దారి తీసింది. విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయంగా, తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా, అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకొల్పారు. 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు. మొదట్లో దీనిపేరు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఎన్టీఆర్ మరణానంతరం 1998లో అప్పటి ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ యూనివర్సిటీ పేరు జోలికి పోలేదు. పైగా ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ను చేర్చారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం 2021లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీల వైఖరి ఎలా ఉన్నా… విద్యార్థుల సర్టిఫికెట్లకు సంబంధించిన విషయం కావడంతో విద్యావంతుల్లో కూడా ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం అయింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వైద్య విద్యార్థులు తమ విద్యా ధ్రువపత్రాలను నమోదు చేసుకునే సమయంలో వర్సిటీ పేరు మార్పు గందరగోళానికి దారితీసింది. విదేశాల్లో ఉన్నత వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే వారిని కూడా ఇది ఇబ్బందులకు గురిచేస్తుందని విద్యావేత్తలు చెప్పినా నాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా టీడీపీ శ్రేణులు చేసిన పని విశ్వవిద్యాలయం భవనంపై ఉన్న పేరును ధ్వంసం చేయడమే. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే విశ్వవిద్యాలయం పేరును తిరిగి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విశ్వవిద్యాలయాల పేరును మారుస్తూ పోవడం విద్యార్థులపై ప్రభావంపడే ప్రమాదం ఉంది. ఇక జగన్ వచ్చిన వెంటనే తీసుకున్న మరో నిర్ణయం ఓ విద్యా పథకం పేరు మార్పు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఏర్పాటు చేసి విదేశీ విద్య చదివేందుకు పేద విద్యార్థులకు ప్రోత్సాహకం అందించింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రాగానే దాని పేరును జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్చారు. ఇది అంబేద్కర్ను దైవంగా భావించే వారందరినీ అవమానించినట్లేనని నాడు చంద్రబాబు అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అంబేద్కర్ పేరును పునరుద్ధరించారు. పనిలోపనిగా జగనన్న విద్యాదీవెన పథకం పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా, వైఎస్సార్ విద్యోన్నతి పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర దుమారం రేపిన మరో పేరు తెలుగు సంస్కృత అకాడమీ. అసలీ ఆలోచన ఎలా వచ్చిందో కానీ ఎవరూ దీనిని హర్షించలేదు. ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారంటూ ప్రశ్నించిన వారికి సమాధానం రాలేదు. తెలుగును నిర్వీర్యం చేసేందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ లాంటివారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరి ఇప్పుడు వీరిది అధికారం… దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొత్త ప్రభుత్వం రాగానే పథకాలపేర్లు మార్చి ఏమార్చుతున్నాయనేది ఒక వాదన. గతంలో వైసీపీ అధికారాన్ని చేపట్టిన వెంటనే ఇలాంటి చర్చలే చేపట్టింది. చాలా పథకాలకు జగనన్న, వైఎస్సార్ పేర్లను పెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాల పేర్లను మార్పు చేయడం మొదలెట్టింది. ఇప్పటి వరకు మార్చిన పేర్లలో కేవలం రెండిరటికి మాత్రమే చంద్రన్న అనే పేరును పెట్టారు. చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా అనే పేర్లను మాత్రమే ఉంచారు. ఇది బీజేపీ, జనసేనతో కలిసిన కూటమి ప్రభుత్వం కావడంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని భావించాలి. అనేక పథకాలకైతే ఇంగ్లీష్ పేర్లు పెట్టారు. స్పందనకు పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్, విద్యా కానుకకు స్టూడెంట్ కిట్ స్కీం అని ఇలా మార్చారు. తెలుగులో అయితే సామాన్యులకు కూడా అర్ధం అవుతుంది కదా.! పథకాల పేర్లు ఎలా ఉన్నా, వాటి అమలులో చిత్తశుద్ధి కనిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా పేర్ల మార్పు ప్రకటనలు, ముద్రణ వంటి వాటికి కోట్లలోనే ఖర్చవుతుంది. రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయలు ఖర్చు బూడిదలో పోసిన పన్నీరయింది. జగన్ బొమ్మతో ముద్రించిన విద్యాకానుక కిట్లను వృథా చేయకుండా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. ఇది ఆహ్వానించదగిన విషయం. ఇలాంటి స్ఫూర్తినే మిగిలిన వాటిపైనా చూపించాలి. పథకాలు ప్రజలకు లబ్ది చేకూర్చేవే కాబట్టి వాటి పేర్లు ఎలాగు చేరువవుతాయి. కానీ ఆయా పేర్లపై ఖర్చుపెట్టే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. హద్దు రాళ్లపై కూడా తన ఫొటోను వేసుకున్న నేతలకు నేడు ప్రజల ఎలా గుణపాఠం చెప్పారో చూశాం. గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రస్తుత ప్రభుత్వం చూడాలి.
అనిల్ కుమార్ శిఖా సెల్:010070540