Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

మట్టిరాసిన మరణశాసనం

షేక్‌ కరిముల్లా

‘మూఢ నమ్మకాల పునాదులమీద అసత్యాల సమాజం నిలిపి అమాకులనెత్తురుతో హోళీ ఆడుకుంటున్న దగుల్బాజీల్లారా! సత్యం ఏదో ఒక రోజు కారుమబ్బుల చీకటిని చీల్చుకొని ప్రచండ ఉషస్సుతో ఈ సమాజంమీద పరుచుకుంటుంది. జ్ఞానం చేతిలో కాగడవచ్చి మొత్తం ప్రపంచాన్ని కాంతి మయం చేస్తుంది. అప్పుడు ఈ దోపిడి సమాజం కూలిపోయి సత్యం అధారంగా ప్రకృతిని ప్రేమించే ఓ సమాజం నిర్మితమౌతుంది. అంతదాక మా ఈ పోరాటం కొనసాగుతుంది’
దేశంలో నకిలీ బాబాలకు కొదువేలేదు. వీరి లీలలు, అఘాయిత్యాలు, చీకటి వ్యాపారాలు యధేచ్చగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా గడిచిన పదేళ్లుగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ నకిలీ బాబాలు సహజంగా నేర స్వభావం కలిగి ఉంటారు. బాబాలుగా అవతారంఎత్తి నేర వ్యాపార స్వామ్రాజ్యాలు నిర్మించుకుంటారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని అంధ, మూఢవిశ్వాసాలను ప్రజల్లో నింపుతూ లక్షలకోట్ల ఆస్తులు దోచుకుంటారు. ఘరానాగా బతుకుతుంటారు. ఇలాంటి దొంగ బాబాలకు అపారమైన రాజకీయ పలుకుబడి ఉంటుందని అనేకసార్లు రుజువైంది. సమాజంలో డబ్బున్న పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు పార్టీలతో నిమిత్తం లేకుండా బాబాలను, మూఢ నమ్మకాలను విశ్వసించటంలో పోటీ పడుతుంటారు. మరీ విచిత్రం ఏమంటే చదువుకున్న మూర్ఖులు, సైన్సు చదువుకొని, ఏ మాత్రం శాస్త్రీయ దృక్పధంలేని సైంటిస్టులు అనబడే వారు కూడా ఈ బాబాల చుట్టూ తిరుగుతుఉంటారు. అంటే జ్ఞానానికి- చదువుకు లింకు తెగి పోయిందని అర్ధంచేసుకోవాలి.
గతంలో అనేక నేరాలు చేసిన ఆశారామ్‌దేవ్‌, డేరాసచ్చబాబ తదితర 15మంది వరకు బాబాలు జైళ్లలో ఉన్నారు. దేశంలో నూటికి 80శాతం తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్ధ యాత్రలలో జరుగుతున్నవేనని ఆధ్యయానాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్‌లో జులై రెండున స్వయం ప్రకటిత దేవునిగా ప్రకటించుకున్న బోలేబాబా ‘సత్సంగ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి 2.50 లక్షల మంది హాజరయ్యారు. బాబా పాదధూళి తాకితే సకల పాపాలు, రోగాలుపోతాయని, బాబా మహిమగల వ్యక్తిని ఆయన శిష్యగణం ప్రచారం చేయడంతో ఆయన పాదధూళి కోసం అమాయక జనం పోటీ పడ్డారు. తొక్కిసలాట చోటుచేసుకుంది. 121 మంది మరణించారు. మరణించిన వారిలో 112 మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. వీరందరూ పేద,బడుగు జీవులే. ఈ ఘోరానికి కారకుడైన బాబా తొక్కిసలాట జరిగిన ప్రదేశం నుంచి తన మనుషులతో కలసి దర్జాగా ఉడాయించాడు. ప్రభుత్వం విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంది. 855 పేజీల సిట్‌ నివేదికలో బోలేబాబా పేరులేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌లో ఇతని పేరే లేదు. అంటే రాజ్యానికి బాబాలకు మధ్య బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందే అనేక కేసులు ఇతనిపై ఉన్నాయి. స్త్రీలపై లైంగిక అత్యాచార కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. బాబాగా కొత్త అవతారం ఎత్తి, 100కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు నెలకొల్పాడు.
2005లో మహారాష్ట్రలోని వాయిలో మందరాదేవి గుడివద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండీదేవి ఆలయం వద్ద 250 మంది, హిమాచలప్రదేశ్‌లోని నైనాదేవి గుడివద్ద 162 మంది, ఇంకా వెనక్కి వెళితే 1954లో అలహాబాద్లో జరిగిన తొలి కుంభమేళాలో 800 మంది, మన రాష్ట్రంలో 2015లో గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 20మందికి పైగా చనిపోయారు. ఇవన్ని గుండెల్ని మెలిపెట్టే విషాదాలు తరుచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనల్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఊహించని స్థాయికి ఎదిగినా దొంగ బాబాలు కూడా ఎక్కువై పోతున్నారు. అయినా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ప్రజలు కూడా వాస్తవాన్ని గురించిన శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నట్లు కనిపించటం లేదు. మతాలు, దేవుళ్లు, సాంప్రదాయలు అంటూ మధ్యయుగాల్లో జీవిస్తున్నవారే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎవరి నమ్మకాలు వారివి అని మర్యాదగా సమర్థించుకొని పోతున్నామేగాని ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను కల్పించటంలో పాలకుల వైఫల్యం మెండుగాఉంది. ప్రజల బలహీనతలను, అమాయకత్వం, అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని వేలకోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా స్త్రీల మానప్రాణాలు హరించి వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మన పాలకులకు చీమ కుట్టినంతకూడా లేదు. పైపెచ్చు రాజకీయ నాయకుడు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు సైతం దొంగబాబాల చెంతకుపోయి పొర్లు దండాలు పెడుతూ, వారికి పాదదాసులుగా మారిపోతున్నారు.
జీవన సంక్షోభాల నుంచి ప్రజలు బాబాలను ఆశ్రయిస్తు న్నారు. అవధులు దాటిన ఈ బాబాభక్తి వెనుక ఉన్న సామాజిక, మానసిక వెనుకబాటు తనాన్ని శోధించాలి. పేదరికం, దారిద్య్రం నుండి అమాయక ప్రజలు బయటపడే మార్గం ఈ వ్యవస్థలో లేకనే ప్రజలు దేవుడు, దయ్యం, మంత్రాలు, తంత్రాలు అంటూ మూఢాచారాలను నమ్ముతూ ఈ దొంగ బాబాలను నమ్ముతున్నారు. అందుకే మూఢాచారాలు, దొంగబాబాలను నిషేధిస్తూ ఓ ప్రత్యేక చట్టం తేవాలి. ఈ ప్రకృతిని ఏ దేవుడు సృష్టించలేదని, ఈ ప్రకృతి అంతా స్వతహాగా భౌతిక పదార్థాలతో నిండి ఉంటుందని, పదార్థాలకు పదార్థ ధర్మాలేగాని మహిమలు ఉండవని ప్రజలు గ్రహించాలి. ప్రకృతి, సామాజిక పరిణామాలను శాస్త్రీయ దృక్పధంతో విద్యాలయాల్లో మొదటినుంచి వివరిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంచేస్తూ తీసుకువెళాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అంధ మూఢత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచటానికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
సెల్‌: 9705450705

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img