రా బావ ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తూ వస్తున్నావు పార్వతి మీ అన్నయ్య వచ్చాడు. ఆ ఏంలేదు బావ ప్రతిరోజు జరిగే సంఘటనలు చూసి మనసు వికలమవుతోంది. మనిషి సాటి మనిషిని తనలాగ ఎందుకు చూడలేకపోతున్నాడో అర్థం కావడంలేదు. పరాయి స్త్రీని తన తోబుట్టువులాగ చూడడు. ఈ సమాజంలో ఒంటరిగా బతకలేం కనుక సాటివారిని తనలాగ చూడాలనే జ్ఞానం లేకుండా బతుకుతున్నారు. నిజమే బావ మానవ శరీరం చాలా విలువైనది గొప్పది. చాలా విచిత్రమైనది కూడ. జీవ పరిణామం ఎన్నో దశలుమారి ఈ స్థితిని సంతరించుకుంది. ఈ శరీరం పాంచ భౌతికం. అంటే పంచ భూతాలుగా చెప్పే ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరంలో వాటి అన్నింటిలో లేని ఒక అంశం దాగి ఉంది. అదే మనసు. పంచేంద్రియాలను మనసు చూడగలదుగాని యింద్రియాలు మనసును చూడలేవు. కాని ఆ మనసు ఆజ్ఞ ప్రకారమే యింద్రియాలు పనిచేస్తాయి. తత్త్వశాస్త్రంలో మేను అనే శరీరం భౌతికంగాను మనసు భావ పదార్థంగాను మనం చెప్పుకుంటున్నాం. కాని అసలు మనసంటే ఏమిటి దాని రూపమేమిటి అదెలా ఉంటుందని ప్రశ్నలు ఉదయించకపోవు ఆ ప్రశ్నలు రాకమానవు. అసలు మనసు ఎక్కడ ఉంటుంది. మనిషికి యితరంగా ఉంటుందా లేక మనిషిలోనే ఉంటుందా అనే అనుమానం రావచ్చు. మనసు వేరు, బుద్ది వేరా ఒకటేనా అనే విషయంలో ఇప్పటికి సత్యాన్వేషణ పేరుతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాని మనసు మాత్రం మనిషికి యితరంగా లేదని మేనులోనే ఉందనే విషయంలో భేదాభిప్రాయం లేదు. మనిషి ఉనికిని అనుమానిస్తే తనను తాను అనుమానించుకున్నట్లే. శరీరాన్ని పంచేంద్రియాలను చూడగలంగాని మనసును చూడలేం. కాని సర్వ ప్రపంచాన్ని చూడగల్గి సర్వశక్తులు చేజిక్కించుకున్న మనిషే ప్రపంచానికి కేంద్రబిందువు. కాని బావ ప్రస్తుతం సమాజంలో ప్రస్తుతం మూకస్వామ్యం ప్రజాస్వామ్యంగా నడుస్తోంది గాని మనిషికి విలువ లేదుగ. నిజమే కాని ప్రతి మనిషిని నడిపించేది మనసే. అంతటి గొప్ప మనసు మనిషిలో ఉన్నప్పుడు మనిషిలో ఉన్న ఆత్మ కాక మరో జీవాత్మ ఉందనే వాదన సరిపోక అద్వైతం బయటకొచ్చింది. మనసు కనబడనంత మాత్రాన లేదని చెప్పలేం. కరెంటు, గాలి లాంటివి రూపం చూడలేకపోయినా వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం. కనుక అవి లేవు అని అనలేం. నా మనసు బాగాలేదు విసిగించకని సహజంగా అంటూ ఉంటాం. ఉదాహరణకు ఒక మట్టి ప్రమిదలో నూనె పోసి వత్తులు వేసి వెలిగిస్తాం. ఫలితంగా వెలుతురు వస్తుంది. అక్కడ ప్రమిదలు వత్తులు శరీరం లాంటివయితే దీపం మెదడు లాంటిదని, వెలుగు తరంగాలు మనసులోని భావాలుగా తత్త్వవేత్తలు అభివర్ణిస్తారు. ఆ భావాలు మనో ఉత్పాధికాలు. ఆ భావాలు మనసు నుంచే వస్తాయి. ఆ భావాలే కోరికలుగా మారి వాటిని తీర్చుకోవడానికి మనిషి ఉద్యమిస్తాడు. అది మానవుని ప్రాథమిక హక్కు బావ. అది సరే మనసు ఎంత గొప్పదంటే బాధను తగ్గించగలదు పెంచగలదు. కవి ఆత్రేయ మనసు మీద పరిశోధన చేసిన వాడిగా మనసుపై పాటలు రాసి మనసుకవిగా గణుతికెక్కాడు. మనసున్న మనిషికి సుఖం లేదంటాడు. సంతోషం, బాధ అన్నింటిని అందించేది బహిర్గతం చేసేది మనసు. చెడ్డపని చేసినా మంచిపని చేసినా అన్నింటికి మూలం మనసే. మనసును అదుపులో ఉంచకపోతే అన్ని అనర్థాలే జరగవచ్చు. అందుకే మనసా కవ్వించకే అంటాం. నా మనసు బాగా లేదను బాధగా ఉందనో అంటాం. మనసు ఎక్కడుందో ఎలా ఉంటుందో తెలియకపోయినా ప్రపంచంలో జరిగే మంచిచెడులను ప్రోత్సహించి అన్నింటికి కారణభూతమవుతుంది. మనం ఏదో చెయ్యాలని అనుకున్నా చేయలేం. నా మనసు అంగీకరించడం లేదని మాత్రం అంటుంటాం. మనసును చూడలేక పోయినా మనసు ఆదేశాలు పాటించక తప్పదు. మనలోని మనసు మనల్ని ఆడిస్తూ ఉంటుంది. మంచివారుగానో, చెడ్డవారుగానో సమాజంలో ముద్రకు కారణం మనసే. ఎండమావిని నీరుగా మన కన్ను చూపెట్టినా అక్కడ నీరు లేదని మనసు చెబుతుంది. మనసనేది తెర వెనుక ఉండే సినిమా దర్శకుడు లాంటిదైతే మనిషి తెర ముందు నటించే నటుడు. శరీరాన్ని కోసి వాటిని చూడగలం. స్పృశించగలం వాటి వివరాలు పనితీరు లాబరేటరీ ద్వారా తెలుసుకోగలం కాని శరీరంలోని యితర భాగాల వలె మనసును చూడలేం. కాని మనిషి ప్రవర్తనకు కారణం మనసే. జ్ఞాపకశక్తి, తెలివితేటలు, భావాలు, ఆదేశాలు, మాటతీరు, ప్రవర్తన అన్నింటికి మనసే కారణం. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట అంటాడు పోతనామాత్యుల వారు. కాని పలికించేది మనసే అంటారు భౌతికవాదులు. మనసుంటే మార్గం లేకపోదనే సామెత మనకు తెలుసు. అంటే మనసు ఆలోచిస్తే మార్గం దొరుకుతుందని. ఒక కవి సరిగా రాయకపోతే మనసు పెట్టి రాయలేదని అంటాం. మనసు బాగాలేకపోతే ఏ పని చేయలేం. అంతేగాక మనసు వికలమైననాడు వ్యాధిగ్రస్తులమవుతాం. దాదాపు 200 రకాల మానసిక వ్యాధులు ఉన్నట్లు మానసిక వైద్యులు చెబుతారు. మనసు సంకల్పిస్తుంది. ఆలోచించి విచక్షణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. ఆచరణకు నడిపిస్తుంది. మనసు ఆదేశం లేకుండా ఏ పని చేయలేం. మనసు గతి యింతే మనసున్న మనిషికి సుఖం లేదంతే అన్న ఆత్రేయకు మనసు లేదని నిర్మాతలు అనేవారు. నాకు శత్రువు నా మనసే అంటాడు సామాన్యుడు. అలా అనే మనిషి మనసును అదుపులో పెట్టుకోలేడు. మనసును జయించి అదుపులో ఉంచుకోవాలంటే అందుకు తపస్సు చేయాల్సినంత పని. కాని విజ్ఞులు, పెద్దలు అనేకమంది మనసును జయించిన వారున్నారు. అటువంటి వారందరు వివిధ రంగాలలో గణుతికెక్కారు. కాని అందరికి సాధ్యం కాదు. అందుకే సామాన్యుడు మనసా కవ్వించకే అని మనసును వేడుకోక తప్పడంలేదు.
సెల్: 9885569394