ప్రొఫెసర్ కె.ఎస్. చలం
భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిది. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్యమం ఆంధ్ర మహాసభ 1913లో ఏర్పడిన దగ్గర నుంచి ఉన్నప్పటికీ కీ.శే పొట్టి శ్రీరాములు అమరత్వంతోనే అది సిద్ధించింది. తెలుగుజాతి చాలా విశాలమైనది. భారతదేశంలో అత్యధిక భాగంలో తెలుగుజాతి విస్తరించివుంది. అందుకే హైదరాబాద్ నిజాం అధీనంలో ఉన్నప్పటికీ అక్కడి తెలుగువారు ఆంధ్ర రాష్ట్రంలో 1956లో కలిశారు. అది అనేక రాజకీయ, ఆర్థిక వైషమ్యాలకు దారితీసింది. ముల్కి, ప్రత్యేక ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర అంటూ తెలుగు ప్రజలు రెండుగా విడిపోవడానికి అనేక చారిత్రక, రాజకీయ కారణాల మూలంగా కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఆ కమిటీ తమ నివేదికలో రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానతలను అంచనా వేసింది. దాని ఆధారంగా తెలంగాణ ప్రజల బలిదానాల నేపథ్యంలో పార్లమెంటులో అనేక డ్రామాల మధ్య 2014లో రెండు రాష్ట్రాలు ఏర్పాటుచేస్తూ ఒక చట్టం ఆంధ్రప్రదేశ్ రి ఆర్గనైజేషన్ యాక్ట్ 2014ను మార్చి 1 న రాష్ట్రపతి సంతకంతో విడుదలైంది. ఈ చట్టంలో 108 నిబంధనలు పొందుపరిచారు. 13 షెడ్యూల్స్, 12 విభాగాలుగా 70 పేజీల చట్టం రూపొందింది. కొత్తగా ఏర్పడే రాష్ట్రాలకు విభజన తేదీని జూన్ 2, 2014 నిర్ణయించారు. అయితే 1953 నాటి ఆంధ్రప్రదేశ్ కాకుండా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను అంగీకరించడానికి ఆంధ్రప్రాంత ప్రజలు మానసికంగా సిద్ధపడక తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎన్నికల్లో కేంద్ర పాలకపార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం ఎక్కడ జరగాలనే నిర్ణయం కోసం కేసీ శివరామ కృష్ణన్ కమిషన్ను నియమించింది. ఆ కమిటి 2014ఆగస్టు 31న నివేదిక ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 4న అమరావతి రాజధానిగా తీర్మానించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనవరి 2019లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టింది. అది న్యాయపోరాటంలోకి వెళ్లటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరైన పరిపాలన వేదిక లేక నష్టపోయింది. భారతదేశంలో ఐదవ స్థానంలో వుండవలసిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారిపోయింది. 2014 చట్టంలో అమలు చేస్తామన్న హామీలు పూర్తిగా అమలు కాలేదు. అవి:-
- కొత్త రాజధాని నిర్మాణానికి 94(3) (4) ప్రకారం ఆర్థిక సహాయం పూర్తిగా అందలేదు.
- వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ` ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు అభివృద్ధికి నిధులు రాలేదు.
- చట్టంలోని 84, 85 అధికరణల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య జరగవలసిన నీటి పంపకం కోసం ఏర్పడిన వ్యవస్థలు పూర్తిగా పనిచేయడం లేదు.
4.చట్టంలోని 90 అధికరణ ప్రకారం పోలవరం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. పదేళ్లయినా ఇది ఒక కొలిక్కి రాలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లేక ఎడమ గట్టు కాల్వల పనులు పూర్తికాలేదు. - మౌలిక సదుపాయాల కల్పనలో జరిగే లావాదేవీలకు పన్ను రాయితీలు ప్రకటించారు. నిజానికి ఈ అధికరణ దృష్ట్యా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆర్థిక సహాయం చేయవచ్చు.
- 75వ అధికరణలో పేర్కొన్నట్లు 10వ షెడ్యూల్లోని 107 సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా న్యాయం జరగలేదు.
- ఆంధ్రప్రదేశ్ వనరుల, ఆర్థికస్థితిని దృష్టిలో పెట్టుకొని 92వ అధికరణను రూపొందించి పదవ షెడ్యుల్లో పెట్టారు. ఇదే ఆంధ్రప్రదేశ్ అవసరాలను, వనరులను కాపాడుతుంది. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహించవలసిన మార్గ నిర్దేశనం చేయడమైనది. ఇందులో…
(ఎ) బొగ్గు గనులకు సంబంధించి సింగరేణి తదితర గనులలో ఆంధ్రకు రావలసిన వాటా.
(బి) చమురు, గ్యాస్కు సంబంధించి సరైన మార్గదర్శకాలు యివ్వాలి. ఇంతవరకు కేజీ బేసిన్ నుంచి లభిస్తున్న ఈ రెండు వనరులపై ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు రావలసిన అదనపు ఆదాయం రావడం లేదు.
(సి) విద్యుత్కు సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం కావలసిన ప్రాజెక్టుల గూర్చి సరైన స్పందన లేదు.
(8) విద్యాసంస్థల ఏర్పాటులో 93 అధికరణ ప్రకారం రావలసిన సంస్థలు, దుగరాజు పట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు.
(9) దిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ను పోలిన వైజాగ్ -చెన్నై కారిడార్కు అడుగులే పడలేదు.
(10) విశాఖ కేంద్రంగా ఏర్పడిన రైల్వేజోన్ నిర్మాణం, దాని ప్రాతిపదికన రైల్వే రిక్రూట్మెంట్ జరగలేదు.
(11) విశాఖ, విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోకు 2015 లోపు నిర్ణయం జరగాలని వున్నా ఎటువంటి పనులు ప్రారంభించలేదు.
(12) డిలిమిటేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 225 సభ్యులు గల శాసనసభకు అడుగులు పడలేదు.
(13) పైన పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ చట్టం రూపంలో ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో అమలుకానందున ఆంధ్రప్రదేశ్కు కచ్చితంగా ప్రత్యేక హోదా యివ్వవలసి వుంది.
కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనేక సాకులుచెబుతూ ఆంధ్రప్రదేశ్కు న్యాయబద్ధంగా రావలసిన ఆర్థిక సహాయం అందించలేదు. దాని కోసం ప్రత్యేక హోదా అన్న అంశం ఇప్పుడు వీలుకాదు అంటున్నారు. దానికి వారు చెప్పే కారణం ఇప్పుడు ప్రణాళికా సంఘం లేదు కాబట్టి ప్రత్యేక హోదా అమలుకు వీలుకాదు అని. ఇది సాకు మాత్రమే, ఎందుకంటే నీతి ఆయోగ్ ద్వారా గతంలో ప్రణాళిక సంఘం చేసే చాలా పనులు, కార్యక్రమాలు నిధులు పంపిణీ జరుగుతోంది. ఆ నిధులు ఏ విధంగా విడుదలవుతున్నాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వవచ్చు. అందులో మిగతా రాష్ట్రాలు అడగడానికి, పోటీ పడటానికి వారికి చట్టరీత్యా ఎటువంటి అవకాశం లేదు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 చట్టంలో అన్ని పొందుపరిచి వుండటంతో రావలసిన నిధులు ఇవ్వవచ్చును. ఫైనాన్స్ కమిషన్ అంగీకరించదు అన్న అబద్ధంతో కేంద్రప్రభుత్వ ఉద్దేశం బైటపడిరది. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఇందులో జోక్యం చేసుకోడానికి అమెండేట్ వుండదు. న్యాయబద్ధంగా 2014 చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ కు రావలసిన నిధులు, వనరులు, వాటాలు ప్రోత్సాహకాలు అందకపోగా, సాధారణంగా లభించే వాటాలో కూడా రాజకీయ అవసరాలు జొప్పించి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడేలా చేశారు. నిజానికి దేశంలోకి విదేశాల నుంచి వస్తున్న రెమిటెన్సేస్లో తెలుగువారి నిష్పత్తి ఎక్కువగా వుంది. ముఖ్యంగా డాలర్ రూపేన దేశానికి వస్తున్న ఎన్ఆర్ఐ చెల్లింపులలో ఆంధ్రులే ముందుంటారు. అందుచేత కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి పట్ల చూపుతున్న వివక్షను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిచూపుతూ న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావలసిన ఆర్థిక వనరులను రాబట్టుకోవాలి, అందుకు ప్రజల, రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలి.
దక్షిణాదిలో వెనుకబడిన ఆంధ్ర:
2014 కు ముందు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా వుండేది. రాష్ట్ర సగటు ఆదాయం 2004-05- 2012-13 మధ్య 7.25 శాతానికి పెరిగింది. ఇది ప్రధానంగా తయారీరంగం, సేవా రంగాల వృద్ధి మూలంగా జరిగింది. 2012`13 లో రాష్ట్ర ఆదాయం 2.35 లక్షల కోట్లు. సగటు ఆదాయం రాష్ట్రంలో గాజువాకతో కూడుకున్న విశాఖపట్నం నుంచి 32,423 రెండవ ర్యాంకులో కృష్ణాజిల్లా రూ.26,749 వుంది. ఇందులో సేవా రంగం నుంచి 55.3 శాతం, వ్యవసాయం 23.1 శాతం, పరిశ్రమలు నుంచి 21.5 శాతం వచ్చింది. ఇందులో పరిశ్రమలు, సేవారంగాల నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ ఉంటే వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు 2004-05 నుంచి 2012-13 లో చూడవచ్చు. వ్యవసాయ రంగంలో మత్స్య, పశుసంపద మూలంగా వచ్చే ఆదాయం పెరుగుతూ వుంటే అడవులు తదితర రంగాలలో ఒడిదుడుకులు ప్రస్ఫుటమయ్యాయి. అలాగే పరిశ్రమల రంగంలో తయారీ రంగం, మైనింగ్లో కొంత అస్థిరత కనిపించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ చాలా వైరుధ్యాలను విషమ పరిస్థితులను ఎదుర్కొన్నది. ఒకప్పుడు బలంగా ఉన్న సేవారంగం రాష్ట్ర ఆదాయంలో 2014-15 నాటికి 44.13 శాతానికి, 2020-21 కి 40.89శాతానికి పడిపోయింది. పారిశ్రామిక రంగం 25.48 శాతం నుంచి 21.84 శాతానికి దిగజారింది. ఈ కాలంలో వ్యవసాయ రంగమే ఆదుకుంది. అది 30.39 శాతం నుంచి 37.27 శాతానికి పెరిగింది. ఇందులో ముఖ్యంగా మత్స్య, పశువులు, కోళ్ల పరిశ్రమ వంటి రంగాలు ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాయి. అంటే ఒకప్పుడు వ్యవసాయం ఆధారంగా పారిశ్రామికంగా ఎదుగుతున్న రాష్ట్రం విభజన తరువాత మళ్లీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోవడం, వ్యవసాయంపై ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఆర్థికంగా ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా కోవిడ్ కాలంలో ఆంధ్ర ప్రజలు చాలా యిబ్బందులు ఎదుర్కొన్నారు.
(తరువాయి రేపటి సంచికలో)