చింతపట్ల సుదర్శన్
వెలుతురు అరుగుమీది నుంచి కిందికి దూకింది. ఇంకాస్సేపయితే చీకటి పడుతుంది ఇంకా ఈ గ్రామసింహం రాలేదేమిటి అనుకుంటూ అసహనంగా అటూ ఇటూ జూలో చిరుతపులిలా తిరగసాగింది డాంకీ. ఎప్పట్లానే టయానికి అరుగు ఎక్కాడు అబ్బాయి.
అరుగుమీద తన జాగాలో డాగీ కనబడక ఏమిటీ ఇంకా ఇంటికి రావాలనే బుద్ధి పుట్టలేదా మీ ఫ్రెండుకి అనడిగాడు అబ్బాయి. అదే నేనూ అనుకుంటున్నా. రా బుద్ధి కాలేదా లేక మరేదన్నా జరగకూడనిది జరిగిందా అని మథనపడుతున్నా.
తను ఎప్పుడూ ఇంత లేట్ చెయ్యలేదు అంది డాంకీ. ఏం జరిగిందో మరి. ఈ రోజుల్లో ఇంటి గడప దాటిన మనుషులు తిరిగి ఇల్లు చేరే గ్యారంటీ లేదు. కార్లు డివైడర్లను ఎక్కేయటం బస్సులు బైకుల్ని గుద్దేయడం మామూలైపోయింది. మనుషుల ప్రాణాలకే దిక్కూదివాణం లేని పరిస్థితి. ఇక కుక్కల సంగతి చెప్పాలా. ఏ రోడ్డు మీద చూసినా కుక్క చావులే కదా. అశుభం పలకకు మన డాగీకి ఏమీకాదు అంది బెంగపడుతూ డాంకీ.
లోపలి గదిలో నుంచి గుసగుసగా మాటలు వినపడ్డయి. ఎవరు? ఎవరది? అన్నది డాంకీ.
నేనే వెనక దారినుంచి వచ్చి ఇక్కడ దాక్కున్నానంది డాగీ. నువ్వా! వచ్చేశావా! ఎందుకు దాక్కున్నావు. రా. బయటకి అన్నాడు అబ్బాయి. ఏం చెప్పాలి బ్రో. ఊళ్లో కుక్కలు జనాన్ని కరుస్తున్నాయని ఒకటే గోల. మున్సిపాలిటీ వాళ్లు కుక్కల్ని పట్టుకుపోతున్నారు.
చావుతప్పి కన్ను లొట్టపోకుండానే తప్పించుకువచ్చా. ప్రాణభయం తప్పిందిగా, ఇక బయటకు రారాదూ . ఈ చీకట్లో ఎవరూ రారులే అన్నది డాంకీ. డాగీ బయటకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కదా.
ప్రజలు ఏది కోరితే అది తక్షణం ఇచ్చేస్తారు. ప్రజావాణీ, ప్రజాదర్బారూ వగైరాలు ఏర్పాటు చేస్తారు. పాతబడే దాకా కొత్తకొత్తగానే ఉంటుందిలే అన్నాడబ్బాయి. మెగా డిఎస్సీలు, ఉద్యోగాలు, పథకాల మీద పథకాలు ఇవన్నీ మామూలే. తోలు తీయడం, తాట వలవడం చట్టం తన పని తాను చేసుకుపోయేట్టు చెయ్యడం, బంగ్లాలు కూలగొట్టడం ఎల్లకాలమూ జరిగేవే ఎన్నికలయ్యాక అంది డాంకీ.
నువ్వన్నది నిజమే. పాత పథకాల పేర్లు మార్చడం. కొత్త పథకాలు ఏరి కూర్చడం సరే. బంగాళాలు అక్రమమని వీళ్లవి వాళ్లూ కూల్చుకుంటూ ఉండడం పరిపాటే. తొంభై తొమ్మిదేళ్లకు ఏడాదికి పదిరూకల చొప్పున లీజులు ఇచ్చుకోవడం షరా మామూలే. కానీ కట్టిన ఆ భవనాలు కూల్చడం ఎందుకు? వాటిల్లో నాలాంటి కుక్కలకు పోనీ కుక్కల్లా దిక్కులేకుండా బతికే మనుషులకో ఉండటానికి ఇవ్వచ్చు కదా అంది డాగీ.
రాజకీయమూ, రౌడీ ఇజమూ నీకూ నాకూ అర్థమయ్యేవి కావు. పగలూ, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలూ మనుషుల సహజ కవచ కుండలాలు. ఒక ప్రభుత్వం పడిపోతే వచ్చిన ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని మంచి చేసిందని పొగడ్డం జరిగే విషయమేనా? అన్నాడబ్బాయి.
ఎందుకు పొగడ్డం అప్పుచేసి ప్రజలకు పప్పుకూడు కూడా కరువు చేసినందుకా? అసలు ఏ ప్రభుత్వం అయినా ఎందుకు ధీమాగా దర్జాగా అప్పులు చేస్తుందంటావు బ్రో అంది డాగీ.
ఎందుకేముంది తీర్చేది ప్రభుత్వం నడిపేవాడు కాదుకదా. ప్రజలే కదా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు అప్పుల్చేసి ఉచిత పథకాలు అమలు చేయవచ్చు. పథకాలే కదా ఓట్లుగా బదిలీ అయ్యేవి దీన్నే రుణానందలహరి అంటారు. ఇలాగ కొనసాగాల్సిందే మరి అన్నాడబ్బాయి.
ఇదివరకు రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు ప్రతిపక్షం లేని రాజ్యం అయింది. ఈ ఓటర్లు మరీ శాడిస్టులైపోతున్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ప్రభుత్వాలకు ఎదురే లేకుండా చేస్తున్నారు.
వాళ్లు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు మంచి చేస్తే మంచేకాని దుర్వినియోగం చేస్తే అంది డాంకీ. అలాగేం జరగదు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్లయితే మంచే జరుగుతుందని ఆశించవచ్చు. ఆశాద్దాం అన్నాడబ్బాయి అరుగు దిగిపోబోతూ.
అన్నా ఒక మాట ఇప్పుడు మన రెండు రాష్ట్రాల మధ్య ‘కాంపిటేషన్’ జరిగే సూచన్లు కనబడ్తున్నాయి కదా. వీరు చేసింది వారు చెయ్యాలని, వారు చేసింది వీరూ చెయ్యాలని ప్రజలు పట్టుబడితే తట్టుకొని నిలబడాలి కదా ఏలిన వారు ఏలేవారు అంది డాంకీ.
కుందేలు, తాబేలూ రన్నింగ్ రేసు మొదలయ్యిందంటున్నారు మరి. ఎవరు కుందేలో, తాబేలో చూస్తాం గద అని నవ్వాడు అబ్బాయి అరుగుదిగి ముందుకు అడుగేస్తూ. ప్రజా సంక్షేమమే క్షేమం. ఎవరేం అనుకున్నా ఆరోగ్యకరమైన పోటీ ఉండి రెండు రాష్ట్రాల ప్రజలూ క్షేమంగా ఉంటే చాలు. అనవసరంగా నాలాంటి అరిచే కుక్కలు కరవనే కరవవని పట్టుకోకుంటే మేలు అంది డాగీ.