–ఆలూరు ఏ డి ఏ సునీత
విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే ఫర్టిలైజర్ డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఆలూరు వ్యవసాయ శాఖ ఏడిఏ సునీత హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోనే పలు ఫర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు, బిల్స్ బుక్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు కంపెనీ నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే డీలర్ల లైసెన్స్ రద్దు చేసి దుకాణాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. లైసెన్సు, దుకాణం స్టాకు నిలువల ధరల పట్టికను షాపు ముందు బోర్డుపై రోజు రాయాలని సూచించారు. రైతులు సైతం విత్తనాలు కొనుగోలు చేసిన షాపు నుంచి రశీదు తీసుకోవాలని, విత్తనం మొలకకూ రాకుంటే సంబంధిత కంపెనీ నుంచి నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి నరేంద్ర కుమార్, ఎంపీఈఓ వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు.