జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీ 2023-24లో కరువు పరిస్థితిపై నిర్వహించిన సమీక్ష సమావేశంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ప్రెస్ మీట్ నిర్వహించి సమావేశపు వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం నుండి ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ రబీ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన పంట నష్టాలు, పశువులకు గడ్డి, తాగునీటి ఇబ్బందులు, కరువు పరిస్థితులకు సంబంధించి వివరాలు పరిశీలించడానికి కేంద్ర బృందం వచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జిల్లాలను గుర్తించడం జరిగిందన్నారు. ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ మూడు బృందాలుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో మొదటి బృందం పర్యటిస్తుందని, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రెండో బృందం పర్యటిస్తుందని, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో మూడో బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఏ.పి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి కూర్మనాథ్, ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వచ్చి రాష్ట్రంలో ఉన్న రబీ కరువు పరిస్థితి గురించి క్షుణ్ణంగా కేంద్ర బృందానికి వివరించడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లాలోని 14 మండలాల కరువు పరిస్థితిని బృందానికి వివరించడం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందం శ్రీ సత్యసాయి జిల్లాకు బయలుదేరిందని, ఈనెల 20వ తేదీన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాలలో పర్యటన చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా వచ్చి మంచినీటి ఇబ్బందుల గురించి కేంద్ర బృందానికి తెలియజేశారన్నారు. క్షేత్రస్థాయిలో రేపు, ఎల్లుండి గ్రామాలలో పర్యటించి అక్కడ రైతులను కలిసి ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ చర్చించడం జరుగుతుందన్నారు. కరువు పరిస్థితిని వారు కళ్ళారాచూసి నివేదికను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపడం జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కాకుండా 56 కోట్లు ఆర్థిక సహాయం అడిగామన్నారు. ఈరోజు, రేపు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు అక్కడ మండల అధికారులతో, గ్రామస్థాయి అధికారులతో మాట్లాడడం జరుగుతుందని, ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ బృందం రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం విజయవాడకి వెళ్లి చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరుగుతుందని, వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీమ్ పర్యటించి, పరిశీలించి తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి పాల్గొన్నారు.