70 శాతం పోర్టు పనులు పూర్తయితే ఇప్పుడు పునర్ ప్రారంభం ఏమిటో మంత్రి చెప్పాలి
ఇసుక, మద్యంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి
విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్
విశాలాంధ్ర సంతబొమ్మాలి ( శ్రీకాకుళం) : ఈ మండలం మూలపేట ప్రాంతంలో పోర్టు నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయని ఈ ప్రాంతం, జిల్లా అభివృద్ధి చెందుతాదని బలమైన సంకల్పంతో దశాబ్దాల కళ అయినా పోర్టు నిర్మాణం చేపట్టినది మాజి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. మండలం ఎం.సున్నా పల్లి గ్రామంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పోర్ట్ నిర్మాణం సరవేగంగా పనులు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిలుపుదల చేసిందని అన్నారు. దోచుకోవడానికి పోర్టు యాజమాన్యాన్ని, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేయాలనే ఎత్తుగడలతో 70 శాతం పూర్తయిన పోర్టు పనులను మళ్లీ మంత్రి అచ్చం నాయుడు పునర్ ప్రారంభించడం ఏమిటో ఆయనే చెప్పాలని అన్నారు. భూ సేకరణ చేయకుండా, అనుమతులు లేకుండా 2019 సంవత్సరంలో మేమే పోర్ట్ తెచ్చామని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒకవేళ తెస్తే 2024 వరకు ఏం చేశారని ప్రశ్నించారు. మూలపేటపోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ,పోర్టు పనులు కూటమి ప్రభుత్వం అడ్డుకోకపోతే ఈపాటికి మొదటి షిప్పు ల్యాండ్ అయి ఉండేదని అన్నారు. ఇది నిజం కాదని జిల్లా కలెక్టర్ గాని, పోర్టు యాజమాన్యం గాని బహిరంగంగా ప్రకటన చేయగలరా అని సవాల్ విసిరారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన అధికారంతో కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్నత పదవులు అనుభవించిన కింజరాపు కుటుంబీకులు, ఈ జిల్లాకు ఒక్క మంచి పని అయినా చేశారని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని అన్నారు. వ్యాపారులను, తటస్థులను, వైయస్సార్సీపీ వాళ్లను మద్యం టెండర్లు వేయకుండా బెదిరించి సిండికేట్ గా మారి మీ పార్టీ నాయకులకు మద్యం షాపులు కేటాయించుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. మద్యం షాపులు ఎవరికి కేటాయించారు వారి వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే బహిర్గతం చేస్తానని అన్నారు. ఫ్రీ ఇసుక ఇస్తామని చెప్పి ప్రజలను మోసగించారని జగన్మోహన్ రెడ్డి నిత్యం ఫైట్ చేస్తే నిరసనలు చేస్తే ప్రభుత్వం దిగివచ్చి ట్రాక్టర్లకు, ఎడ్ల బండికి ఫ్రీ ఇసుక అని ప్రభుత్వం ప్రకటించిందని ఇది జగన్మోహన్ రెడ్డి ఘనతని అన్నారు. మరోపక్క ఫ్రీ ఇసుక అంటూనే వేలాది, లక్షలాది టన్నుల ఇసుక విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు తరలించి కోట్ల రూపాయలు అధికార పార్టీ నాయకులు దండుకుంటున్నారని విమర్శించారు. ఇసుక, మద్యం వల్ల వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వచ్చిన సొమ్ముతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని తిరగబడే రోజు త్వరలోనే ఉందని 2027 సంవత్సరంలో జరిగే జమిలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు బి .మోహన్ రెడ్డి, మార్పు నాగభూషణరావు, పి శ్రీనివాసరెడ్డి ,తై. నారాయణ, పంగ రామయ్య, నక్క రామ్మోహన్, సత్తారు సత్యం, చిన్ని జోగారావు, పాల్గొనరావు తదితరులు ఉన్నారు.