నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : వీధులలో పారిశుధ్య నిర్వహణ పట్ల నిరంతర పర్యవేక్షణ ఉంచాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు, కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ఆదేశించారు. ఈరోజు ఉదయం స్థానిక 11వ డివిజన్లో పారిశుధ్య నిర్వహణ పట్ల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోషాసుపత్రి,అశోక్ నగర్, బూడి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సంబంధిత పారిశుధ్య పర్యవేక్షకుని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల వ్యర్ధాలను కాలువలోకి జార వేయుట వల్ల క్రిమి కీటకాలు పెరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. వీధులలో ఉన్న చిన్న చిన్న దుకాణాల పరిసర ప్రాంతాలలో వ్యర్ధాలు ఎక్కువగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. డస్ట్ బిన్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలని దుకాణదారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వీధుల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్య సిబ్బంది, కార్యదర్శులు పారిశుధ్య నిర్వహణ పట్ల నిరంతర దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రజలలో మరింత చైతన్యం తీసుకొచ్చి చెత్తాచెదారాలు బహిరంగంగా పడవేయకుండా చూడాలన్నారు. చెత్తబుట్టలు వినియోగించుకునేలా అవగాహన పెంచాలన్నారు.