ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేవారు తమ తల్లిదండ్రుల ఓటరు వివరాలను సమర్పించాలనే నిబంధనపై వస్తున్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తోసిపుచ్చింది. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనేమీ కాదని, ఓటర్ల జాబితాలో పారదర్శకత, కచ్చితత్వం పెంచేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆదివారం స్పష్టం చేసింది.
ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకురావడం, వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లు ఃఫామ్-6ః ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు, తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల పేర్లు గత ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. పాత ఓటరు రికార్డులతో కొత్త దరఖాస్తులను అనుసంధానించడం ద్వారా నకిలీ ఓట్లకు సులభంగా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ విధానాన్ని గతేడాది (2025) జూన్లోనే బీహార్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ద్వారా అక్కడ ఏకంగా 47 లక్షల నకిలీ, చెల్లని ఓట్లను తొలగించారు. ఇది ఆ రాష్ట్ర మొత్తం ఓటర్లలో దాదాపు 6 శాతానికి సమానం. బీహార్లో విజయవంతం కావడంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరించారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తూ మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నవారి వివరాలను సేకరించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ఏ ఒక్క పౌరుడు ఓటు హక్కును కోల్పోకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఏవైనా పత్రాలు వెంటనే సమర్పించలేకపోయినా, తప్పులను సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఇస్తామని అధికారులు తెలిపారు. రాబోయే ఎన్నికల నాటికి అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఈసీ విశ్వాసం వ్యక్తం చేసింది.


