విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ భవనం లో శుక్రవారం మాతా – శిశు మరణాల మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విశ్వనాథయ్య ముందుగా జిల్లా లో జరిగిన ఒక మాతృ మరణం, ఆరు శిశు మరణాల సమీక్ష జరిపి సంభందిత వైద్యాధికారులు క్రోడీకరించి న నివేదిక లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచనల ప్రకారం సురక్షిత మాతృత్వం, నవజాత శిశువు సంరక్షణ మన అందరి బాధ్యత అని ఏ స్త్రీ జన్మనిస్తూ మరణించ కూడదు, అని ఏ శిశువూ మరణించడాని కే జన్మించ కూడదు అని అన్నారు.
వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జరుగుతున్న గర్భిణి స్త్రీల ఆరోగ్య సేవల విధానం పై ఆరోగ్య సిబ్బంది ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రం లో అవసరమైన పరీక్షలను నిర్వహిస్తూ ప్రతి గర్భిణీ సుఖ ప్రసవం అయ్యే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హై రిస్క్ గర్భవతుల కు సంబంధించిన ఏ ఎన్ ఏం , ఆశా కార్యకర్తలకు తగు సూచనలు ఎప్పటి కప్పుడు అందించాలన్నారు. ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీల ఆరోగ్య దృష్ట్యా రక్తహీనత సమస్య అధిక రక్త పోటు సమస్య లకు అవసరమైన మందులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డా.సుజాత మరియు ప్రభుత్వ గైనకాలజిస్ట్ డాక్టర్లు, చిన్న పిల్లల వైద్య నిపుణులు,డా.శ్రీ హర్ష, డా.మనోజ్, డి పి హెచ్ ఎన్ ఒ . లు ఇందిర, ఈరమ్మ, పాల్గొన్నారు.