విశాలాంధ్ర -ఉరవకొండ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ అన్నారు. బుధవారం ఉరవకొండలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిరపాలనను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికి వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు.ఒకవైపు జగన్ సంక్షేమ పాలన కొనసాగిస్తుంటే అధికార దాహంతో చంద్రబాబు మరోసారి తన హామీలతో ప్రజలను నమ్మించి వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.మహానాడు లో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమన్నారు.జగన్మోహన్ రెడ్డి పథకాలు, పక్క రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్ పతకాలు కాపీ కొట్టి వాటిని ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పార్టీ సీనియర్ నాయకులకు ఘన సన్మానం
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పునఃప్రారంభం సందర్భంగా ఉరవకొండలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ గిరిజమ్మ, యువనేత వై. ప్రణయ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూలమాలలు, శాలువాలతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీనే అంటిపెట్టుకొని ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన, కరుడుగట్టిన వైస్సార్సీపీ నాయకులను సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.