ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరుకావాలి
అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు
సాక్షులను ప్రభావితం చేయకూడదు
అరెస్ట్ చేస్తే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్
తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి తెలంగాణ హౖెెకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఇటీవల అవినాశ్రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, దానిపై మూడు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన విషయం తెలిసిందే. అవినాశ్ ముందస్తు బెయిల్కు సంబంధించిన పిటిషన్పై మే 26వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ తర్వాత 27వ తేదీన కూడా మధ్యాహ్నం వరకూ సుదీర్ఘంగా సీబీఐ వాదనలు కొనసాగాయి. అనంతరం వాదనలను పరిగణనలోకి తీసుకున్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ కోర్టు ముందున్న విస్తృత సమాచారాన్ని క్రోడీకరించి, ఇప్పటికిప్పుడు తుది ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తెలియజేస్తూ ఈనెల 31న తీర్పు వెలువరిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అవినాశ్రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చారు. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయొద్దని అవినాశ్ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అరెస్టు చేసినట్లయితే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్పై విడుదలకు సీబీఐకి ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం సీబీఐ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొంది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలియజేస్తూ.. సీబీఐకి అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని అవినాశ్కు తెలిపింది. న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరవచ్చని న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ తెలియజేశారు.