మంత్రి ఉషశ్రీ చరణ్ కు మాజీ ఎమ్మెల్యే ఉన్నం సవాల్
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం : నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చేసిన పనులు, 2014 – 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం చేసిన నియోజకవర్గ అభివృద్ధి పైన చర్చకు సిద్ధమా అని సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ కు మాజీ ఎమ్మెల్యే ఉన్నశీ హనుమంతరాయ చౌదరి సవాల్ విసిరారు. ఆదివారం కళ్యాణదుర్గంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిపించి విజయోత్సవ సభ నిర్వహించిన మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గానికి ఏం చేశానో చెప్పకుండా 2024లో నన్నే గెలిపించాలని వేడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సోమవారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా జలాలను నియోజకవర్గంలో చెరువులకు తీసుకురావడానికి నిధులు మంజూరు చేయించి భూసేకరణ చేస్తున్న సమయంలో ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయని, వాటి పనులను పూర్తి చేయకుండా నేటికీ కాలయాపన జరుగుతుందని దీన్ని మరిచిన మంత్రి కాకమ్మ కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పై వ్యంగాస్త్రాలు చేసిన మంత్రి తాను ఎక్కడి నుంచి వచ్చానో మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు వస్తామని పోలీసులను అడ్డుపెట్టుకోకుండా ఆర్డీవో కార్యాలయం ఎదుటకు వస్తారా అని నిలదీశారు. రూ.4718 కోట్లతో నాలుగేళ్లలో కళ్యాణదుర్గం అభివృద్ధి చేశాం అంటున్న మంత్రి ఉషశ్రీచరణ్ ఆ నిధులను ఏఏ అభివృద్ధి కార్యక్రమాలకు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు మారుతి చౌదరి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లికార్జున,క్ రామాంజనేయులు, డీకే రామాంజనేయులు, గోళ్ళ వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.