ముంబై: యువ విధ్వంసక ఓపెనర్ యశస్వీ జైస్వాల్… భారత జాతీయ జట్టుకు ఆడాలన్న కలను నిజం చేసుకున్నాడు. వెస్టిండీస్ పర్యటన కు వెళ్తున్న టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అయితే.. అతను క్రికెటర్గా మారే క్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా తండ్రికి సాయంగా పానీపూరీ అమ్మిన రోజులు ఉన్నాయి. అలాంటిది అతను ఇప్పుడు ముంబైలో పెద్ద ఇల్లు కొన్నాడు. తాజాగా అతను తన సొంతిటి కలను ఎలా నిజం చేసుకున్నాడో చెప్పాడు. ‘ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కినప్పుడు ఎలాగైనా సరే ముంబైలో మంచి ఇల్లు కొనాలని ఆలోచించేవాడిని. ఎందుకంటే..? సొంతిల్లు లేక నేను ముంబైలో చాలా చోట్ల గడిపాను. అందుకని మంచి ఇల్లు కొనుక్కొని, అందులోమా అమ్మానాన్న, తోబుట్టువులతో హాయిగా జీవించాలని అనుకున్నా. ఇంతకంటే పెద్ద కోరికలేవీ నాకు లేవు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా’ అని యశస్వీ తెలిపాడు. అండర్ -19 వరల్డ్ కప్ యశస్వీ జీవితాన్ని మార్చేసింది. ఆ టోర్నీలో పరుగుల వరద పారించిన యశస్వీ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వీని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ యాజమాన్యం తనపై పెట్టకున్న నమ్మకాన్ని ఈ యువ బ్యాటర్ నిలబెట్టుకున్నాడు. ధనాధన్ ఆటతో జట్టుకు శుభారంభాలు ఇచ్చాడు. దాంతో 2022లో రాజస్థాన్ యాజమాన్యం రూ.4 కోట్లకు ఇతడిని అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ 16వ సీజన్లో యశస్వీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 అర్ధ శతకాలు, ఒక సెంచరీతో తన బ్యాట్ పవర్ చూపించాడు. అంతేకాదు ఐపీఎల్లో వేగవంతమైన అర్ధ సెంచరీతో కేఎల్ రాహుల్ రికార్డు బద్ధలు కొట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్పై యశస్వీ 16 బంతుల్లోనే యాభై పరుగులు చేశాడు. దాంతో, సెలెక్టర్లు అతడిని ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికచేశారు. అంతేకాదు విండీస్ టూర్కు కూడా తీసుకున్నారు.