విశాలాంధ్ర -ఏలూరు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు పవర్ పేట లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి నాలుగు సంవత్సరాల రెండు నెలల పాలనలో రాష్ట్రం 46 ఏళ్ళ వెనక్కి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలు, దోపిడీలు, ఆక్రమణలు అఘాయిత్యాలు,మత్తు పదార్థాలు, గంజాయి, మహిళలకు రక్షణ లేకుండా పోవడం తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకపోవడంతో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల యువత నిరాశకులోనై గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో, యువనేత లోకేష్ చేపట్టిన యువగళంతో పాటు జనసేన కూడా ఎదురు దాడికి దిగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్,ఇతర వైసిపి నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టి మరోసారి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు కులాలపై ప్రేమ చూపించడం వైసిపి పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. కాపు కులం గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని కాపు మంత్రులకు ఇప్పుడు కాపుల సంక్షేమం గుర్తుకు రావటం విడ్డూరంగా ఉందని బడేటి చంటి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు టిడిపి సాగిస్తున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. సంపద పెంచాలన్నా, పేదలకు న్యాయం చేయాలన్నా చంద్రబాబు కే సాధ్యమన్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్ర ప్రజలకు మనుగడ ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో
పెద్దిబోయిన శివప్రసాద్ ,చోడే వెంకటరత్నం,అర్ ఎన్ అర్ నాగేశ్వరరావు, బౌరతు బాలాజీ ,మారం హనుమంతరావు, దాకారపు రాజేశ్వరరావు, వందనాల శ్రీనివాసరావు, జాలా బాలాజీ బడిశెట్టి శ్రీను, పిల్లారి శెట్టి సురేష్ ,మాకల రమేష్..తదితరులు పాల్గొన్నారు.