- పోలీసులకు డిప్యూటీ తహసిల్దార్ ఫిర్యాదు
- వేటపాలెం పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు నమోదు
- సమగ్ర విచారణకు రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలు
- అధికారులే దొంగలంటున్న జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి
విశాలాంధ్ర- వేటపాలెం: వేటపాలెం తహసీల్దారు కార్యాలయం నందు పందిళ్ళపల్లి గ్రామకంఠం లోని సర్వే నెంబరు 72-3 తాలూకు ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డులు మాయం అయిన విషయమై వేటపాలెం డిప్యూటీ తహసీల్దార్ జి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పబ్లిక్ రికార్డ్స్ దొంగతనం జరిగినట్లు వేటపాలెం పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నెం.131/2023 నమోదు అయ్యింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సదరు పబ్లిక్ రికార్డ్స్ మాయమైన విషయమై తహసీల్దారు కార్యాలయము నందు సదరు రికార్డ్స్ ఎవరి ఆధీనంలో ఉన్నవి, ఎప్పటినుండి కనిపించకుండా పోయినది, తర్వాత సంబంధిత అధికారులు చేపట్టిన చర్యలు తాలూకు పూర్తి వివరములు సేకరించే పనిలో వేటపాలెం పోలీసులు నిమగ్నమయ్యారు.
వివరాల్లోకి వెళితే…
పందిళ్ళపల్లి రెవిన్యూ గ్రామ సర్వేనెంబర్ 72-3 పోరంబోకు గ్రామకంఠం (మాలపల్లి), ప్రభుత్వ భూమి తాలూకు పూర్తి రెవిన్యూ రికార్డుల సమాచారం కోరుతూ తేది.23.08.2021న సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం వేటపాలెం కు చెందిన జర్నలిస్ట్ యన్. నాగార్జున రెడ్డి వేటపాలెం తహసీల్దార్ కార్యాలయమునకు దరఖాస్తు దాఖలు చేశారు. కోరిన సమాచారం ఇవ్వడానికి తహసిల్దార్ కార్యాలయం నిరాకరించడంతో సదరు దరఖాస్తు విషయమై రెవిన్యూ డివిజనల్ అధికారి, ఒంగోలు వారి వద్ద నాగార్జున రెడ్డి మొదటి అప్పీలు దాఖలు చేశారు. అప్పీల్ ను చట్టబద్ధంగా పరిష్కరించలేదని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద నాగార్జున రెడ్డి రెండవ అప్పీలు దాఖలు చేయగా, కమిషన్ వద్ద నమోదైన Case No. 3658/SIC- MRK/2022 విచారణ జరిపి తగు చర్యలు చేపట్టవలసిందిగా రెవిన్యూ డివిజనల్ అధికారి, చీరాల వారిని రాష్ట్ర సమాచార కమిషనర్ ఎం రవికుమార్ ఆదేశించినప్పటికీ, రెవిన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో, నాగార్జున రెడ్డి తిరిగి రాష్ట్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. సదరు ఫిర్యాదు Case No.14177/SIC- KJR/2022పై రాష్ట్ర సమాచార కమిషన్ జరిపిన విచారణలో దరఖాస్తుదారుడు నాగార్జున రెడ్డి కోరిన సమాచారం వేటపాలెం తహసిల్దార్ కార్యాలయంలో లభ్యముగా లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. పబ్లిక్ రికార్డ్స్ మాయమైన విషయమై రెవెన్యూ డివిజనల్ అధికారి, చీరాల వారిని సమగ్రంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, మూడు వారాల లోపు పూర్తి నివేదిక సమర్పించాలని తేది.06.03.2023 న రాష్ట్ర సమాచార కమిషనర్ కట్టా జనార్ధన రావు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉత్తర్వుల నేపథ్యంలో చేసేదేమీ లేక రెవెన్యూ అధికారులు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలోనే ఇదే విషయంలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి హై కోర్టు ను ఆశ్రయించగా WP NO.15865/2021విచారణలో ఆమంచి కృష్ణమోహన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఇంటి దొంగల పనే…
వేటపాలెం మండల తహసీల్దారు కార్యాలయంలో పబ్లిక్ రికార్డ్స్ మాయం వెనుక అప్పటి చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ కుట్ర ఉందని ఫిర్యాదుదారుడు జర్నలిస్ట్ యన్. నాగార్జున రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేయటం వలన ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, అధికారులు ప్రజా ప్రయోజనాల కోసమే పని చేయాలని, ఇకనైనా ప్రజల పట్ల వారి సమస్యల పట్ల అదికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,లేని పక్షంలో ఏదో ఒకరోజు చట్టం ముందు దోషులుగా నిలబడవలసిన వస్తుందని, అందుకు ఈ కేసును ఉదాహరణగా అధికారులు గమనంలో ఉంచుకోవాలని నాగార్జున రెడ్డి తెలిపారు.