ఇటీవల మొదట ప్రభుత్వ పాలిటెక్నిక్లలోనే అడ్మిషన్లు జరగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆదేశాలను సవాలుచేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించారు. అడ్మిషన్లపై హైకోర్టు స్టే విధించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా అడ్మిషన్లు జరగని వైనం. యాజమాన్యాలకు 70శాతం అడ్మిషన్ల కోటా ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాయి. దీనితో మైనార్టీ కాలేజీలు డిమాండ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో అయోమయంలోనే పాలిసెట్ విద్యార్థులున్నారు.
పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాసి కాలేజీల్లో టెక్నికల్ కోర్సుల్లో చేరాలని ఎంతో ఆశతో ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశ మిగిలింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంతవరకు పాలిటెక్నిక్ అడ్మిషన్లు జరగలేదు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాసిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,52,122 మంది ఉన్నారు. వీరంతా జూన్లో జరగనున్న కౌన్సెలింగ్కు కాలేజీలను ఎంపిక చేసుకునేందుకు రెడీ అయ్యారు. అంతలో ప్రభుత్వం ఒక ప్రత్యేక సర్క్యులర్ను విడుదల చేసింది. మొదట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అడ్మిషన్లు జరుగుతాయని, ఆ తరువాత ప్రౖెెవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు ఉంటాయని సర్కులర్ తెలిపింది. దీంతో ప్రైవేట్ కాలేజీల వారు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు 126 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రౖెెవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వారు (సెకండ్ షిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు) పాలిటెక్నిక్లు నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు.
ఈ కాలేజీలు రాష్ట్రంలో 137వరకు ఉన్నాయి. ఇక ప్రభుత్వ కాలేజీలు 84 ఉన్నాయి. ఒక ఎయిడెడ్ కాలేజీతో కలిపి మొత్తం రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు 348 ఉన్నాయి. భారీ స్థాయిలో ప్క్రెవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నందున కేవలం ప్రభుత్వ కాలేజీలకే ఎలా ముందు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, విద్యార్థి అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకుని చదువుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న అవకాశాన్ని ఎందుకు తోసిపుచ్చారని ప్రైవేట్ కాలేజీల వాదన. దీంతో అడ్మిషన్లు నిలుపుదల చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వారం క్రితం కోర్టుకు తగిన వివరణ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు కోర్టు నుంచి రావాల్సి ఉంది. రెండునెలల కాలం గాల్లో కలిసిపోయింది. ప్రతి సంవత్సరం జూన్నెలలో అడ్మిషన్లు పూర్తయి కాలేజీల్లో క్లాసులు నిర్వహించేవారు. ఈ సంవత్సరం 1,52,122 మంది పాలిసెట్ ఎంట్రెన్స్ పాస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వుల కారణంగా అడ్మిషన్లు ఆగిపోవడంతో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న వారు సైతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
పాలిటెక్నిక్ చదువుకు స్వస్థి చెప్పి ఇంటర్మీడియట్లో ఇప్పటికే చాలామంది చేరారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు కూడా ముగుస్తున్నందున పాలిటెక్నిక్లో సీటు వస్తుందో రాదోనని, ఇంటర్లో చేరకుండా ఉంటే సంవత్సరమంతా ఇంటివద్ద ఉండాలనే ఆలోచనతో ఇప్పటికే టెక్నికల్ విద్య ఆలోచనను పక్కనబెట్టి ఇంటర్లో చేరారు. ఇందుకు ప్రభుత్వ అనాలోచిత విధనాలే కారణం. ప్రతి సంవత్సరం కనీసం 50వేల మందికి తక్కువ కాకుండా పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తుంటారు. ఈ సంవత్సరం 80వేల సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన గత సంవత్సరం పూర్తయిన సీట్లు కూడా భర్తీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మైనార్టీల మేనేజ్మెంట్ కోటా ఇక నుంచి 70శాతం మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇక నుంచి 70శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. మైనార్టీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద 70శాతం సీట్లు భర్తీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని, కన్వీనర్ కోటా కింద 30శాతం మాత్రమే ఉండాలని మేనేజ్మెంట్ల వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల వారికి మరో ట్విస్ట్. ప్రైవేట్ కాలేజీలు ఈ సంవత్సరం కొన్ని కొత్త కోర్స్లకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేశారు. ప్రధానంగా ఎక్కువ మంది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కోర్స్కు దరఖాస్తులు చేసుకున్నారు. అన్నీ పరిశీలించిన ప్రభుత్వం ఇంతవరకు కోర్స్లకు అప్రువల్ ఇవ్వలేదు. ఒకపక్క అడ్మిషన్ల సమయం ముంచుకొస్తుండగా కొత్త కోర్స్లకు ఎందుకు పర్మిషన్లు ఇవ్వలేదంటే ప్రభుత్వ అధికారులు నీళ్లు నములుతున్నారు.
జి.పి. వెంకటేశ్వర్లు
సెల్ నెం: 7842460555