దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు జాతీయ కూటముల నడుమ ఈసారి రసవత్తర పోరు జరిగే అవకాశాలే మెండు. ‘ముచ్చట’గా మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టాలన్న నరేంద్ర మోదీ కల నెరవేరడం అంత సులువేమీ కాదు. క్రూర చట్టాల ఆమోదం, ప్రతిపక్ష సభ్యులపై వేటుతో ఈ ఏడాదికి పార్లమెంటు సమావేశాలను హడావిడిగా ముగించిన బీజేపీ పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. మరో నాలుగుమాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఎన్నికల సంఘం ఇటీవల ఏపీ పర్యటన సందర్భంలో ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ పార్టీ పరిస్థితులు, విజయావకాశాలపై చూపు మళ్లించాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్పార్టీ ఒక ఎత్తయితే, ఇతర పార్టీలన్నీ ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీ లేని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందంటే ఒక విధంగా సాహసమే అని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి ఇతర పార్టీల తోడ్పాటు లేకుండా కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఓడిరచి, కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పడం కూడా దుస్సాహసమే అవుతుంది. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన యూపీఏ 2014లో ఓడిపోయిన తర్వాత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అది కూడా వరుసగా రెండుసార్లు గెలిచి దిల్లీ పీఠాన్ని అధిష్టించింది. ఈ పదేళ్లలో బీజేపీ దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసింది. ఎన్నడూ లేని విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. 20 కోట్ల మందికిపైగా మైనారిటీలు భయంభయంగా బతుకీడుస్తున్నారు. అక్కడక్కడా కన్పించే ఉగ్రవాద జాడలు దేశవ్యాప్తంగా ఉన్నట్లు భ్రమలు కల్పించి, దాన్ని అడ్డంపెట్టుకొని చీకటి చట్టాలకు శ్రీకారంచుట్టి, పౌర హక్కుల విశాశనానికి పూనుకుంది. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలతో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసి, నియంతృత్వ పోకడలతో ‘ఫాసిస్టు సామ్రాజ్యానికి’ తెరతీసింది. ఇప్పుడు ఎన్నికలవైపు అడుగులు వేస్తూ ఈ నాలుగు నెలల్లో పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లో ‘ఒక రకమైన’ జాతీయ వాదాన్ని, హిందూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పనిలో పడిరది. ఇటీవల జరిగిన ఎన్డీఏ కూటమి రాజకీయ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ విషయాన్ని చెప్పకనే చెపుతున్నాయి. 1.4 బిలియన్ స్వప్నాల దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం 2047 నాటికి వికసిత భారత్ ఆవిర్భావం తథ్యమంటూ బీజేపీ కలలను జనంపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది. 50 శాతానికి పైగా ఓట్లే లక్ష్యంగా 100 మంది సిటింగ్ ఎంపీలకు చెక్పెట్టి, కొత్త ఎంపీ అభ్యర్థులకోసం జల్లెడ పట్టింది. నమో యాప్ సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా హిందీ బెల్ట్ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఆయా రాష్ట్రాల్లో సీనియర్ నేతలైన శివరాజ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్సింగ్ వంటి వారిని కాదని కొత్తవారికి సీఎం పదవులను అప్పగించింది. ఇదే విధానాన్ని 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీచేయనున్న ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ కొనసాగించాలని యోచిస్తోంది. 2019లో 303 స్థానాలు గెల్చుకున్న ఎన్డీఏ అవే స్థానాలను నిలబెట్టుకోవాలంటే ‘మిషన్ మోడ్’లో పనిచేస్తే తప్ప సాధ్యంకాదని స్వయంగా మోదీయే వారి వ్యూహాత్మక సమావేశంలో స్పష్టంచేశారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా పెద్దసంఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవడం, సోషల్ మీడియాను దూకుడుగా వాడుకోవడం, రామమందిర నిర్మాణాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవడం, గత ఎన్నికల్లో కంటే 10శాతం ఓట్లను పెంచడానికి కృషి చేయడంపై దృష్టి పెట్టాలని కూడా మోదీ ఉద్బోధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బీజేపీ లోతుగా అధ్యయనంచేసి, ఆరాలు తీసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది ఎంపీలను బీజేపీ రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఏడుగురు చొప్పున, ఛత్తీస్గఢ్లో నలుగురు, తెలంగాణలో ముగ్గురు పోటీచేశారు. వీరిలో 12 మంది మాత్రమే విజయం సాధించగా, 9 మంది ఓడిపోయారు. ఓడిన వారిలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులు ఉన్నారు. యూపీలో 15 మందికి, మధ్యప్రదేశ్లో 11, బీహార్లో 10, మహారాష్ట్రలో 10, గుజరాత్లో 8 మంది సిటింగ్ ఎంపీల సీట్లు గల్లంతు కానున్నాయి. ఒక్క యూపీ, ఎంపీలల్లో 75 ఏళ్లకు పైబడిన ఐదుగురితోపాటు పనితీరు సంతృప్తికరంగా లేని హేమమాలిని, వరుణ్గాంధీ, మేనకగాంధీ, గౌతమ్ గంభీర్ వంటి వారికి టిక్కెట్లను నిరాకరించే అవకాశాలున్నాయి. అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ (ఏబీఎం) సంస్థ చేపట్టిన సర్వే ఆధారంగా వందమంది సిటింగ్లను పక్కన బెట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించడం గొప్ప విషయమే. ఇక నమో యాప్లో 14 ప్రశ్నలతో కూడిన ‘జన్ మన్ సర్వే’ ఫలితాలపై బీజేపీ ప్రధానంగా ఆధారపడనుంది.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఎన్డీఏను ఓడిరచాలంటే ‘ఇండియా’ కూటమి ఎత్తుగడలు మరింత స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, ప్రజలందరూ సమైక్యం కావాలని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలని ఇండియా కూటమి పిలుపునిస్తే సరిపోదు. అన్నింటికీ ముందు కూటమిలోని సభ్య పక్షాలు ఏకోన్ముఖంగా వ్యవహరించాల్సిన తరుణమిది. ఇటీవల గెలవాల్సిన మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ పార్టీని చరిత్ర క్షమించబోదన్నది అక్షరసత్యం. చిన్న పార్టీలను కలుపుకు పోవడంలో వైఫల్యమే ఈ పరాజయానికి ప్రధాన కారణమని రాహుల్గాంధీ సైతం అంగీకరించి, మూడు రాష్ట్రాల పీసీసీ నేతలపై ధ్వజమెత్తిన అంశం గమనార్హం. బీజేపీపై పోరులో ప్రతి ఓటూ కీలకమేనని అధిష్ఠానం గుర్తించినా, అది పీసీసీలకు ఇంకా చేరాల్సిఉంది. భారత్ జోడో యాత్ర`2కు రాహుల్ సమాయత్తం కావాలని ఒత్తిడి పెరుగుతోంది. ఇండియా ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లిఖార్జున ఖడ్గేను ప్రతిపాదించినప్పటికీ, రాహుల్గాంధీయే ఇప్పుడది అనవసరమని చెప్పి, ప్రాంతీయ పార్టీల మనసులను గెల్చుకునే ప్రయత్నం చేశారు. దక్షిణాదిలో 45 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో కేరళలో లెఫ్ట్పార్టీలు గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా అది ‘ఇండియా’కు ఉపయుక్తమే కావచ్చు. తెలంగాణలో కనీసం 10సీట్లు గెలవాలని, కర్నాటకలో గతంలో ఒక్క సీటు కూడా గెలవకపోయినా ఈసారి 15 స్థానాలు గెల్చుకోవాలని, తమిళనాడులో డీఎంకేతో పొత్తుతో ఎప్పటిలాగానే కనీసం 8 స్థానాలు గెలవాలని ఆశిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తామన్న హామీతోనే హిమాచల్ప్రదేశ్, కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓపీఎస్, ఉచిత బస్సు వంటి పథకాలు ప్రకటించినా, తెలంగాణ తప్ప ఇంకెక్కడా గెలవలేకపోయిన విషయం విస్మరించరానిది. అంటే కేవలం ఉచితాలతో గెలవలేమని, స్థానిక చిన్న పార్టీలతో సరైన ‘సర్దుబాటు, సమన్వయం’తో గెలవచ్చని గుర్తెరగాలి. సమన్వయంతో సీట్ల సర్దుబాటు చేసుకుంటే, సగం విజయం సాధించినట్లే. ఈ విషయం ‘ఇండియా’లోని కాంగ్రెస్తోపాటు అన్ని పార్టీలూ తెలుసుకుంటే 2024 గెలుపు సుసాధ్యమే!