త్రాగునీటికి కటకట, అసంపూర్తి, నిర్మాణాలతో దర్శనమిస్తున్న సామాజిక, అంగన్వాడి భవనాలు.
వార్డు సభ్యుడు సోమరాజు, గ్రామస్తుడు రామారావు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాళ్లగెడ్డలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని బలపం పంచాయితీ వార్డు సభ్యుడు సిందెరి సోమరాజు అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై గురువారం గ్రామస్తులతో కలసి ఆయన మాట్లాడుతూ తరతరాలుగా తమ పంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు పంచాయతీకి శివారు గ్రామమైన రాళ్లగడ్డలో త్రాగునీటి సమస్య తాండవిస్తుందన్నారు.. సుమారు 100కు పైగా గిరిజన కుటుంబాలు కలిగిన ఈ గ్రామంలో తరతరాలుగా త్రాగునీటి సమస్య తమను పట్టిపీడిస్తుందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చిపోతున్నా తమ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఏ ఒక్కరూ స్పందించిన దాఖలాలు లేవన్నారు. పంట పొలాలకు అనుకొని ఉన్న ఊట గెడ్డ నుండి త్రాగునీరు తెచ్చుకోవలసిన పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ సీజన్లోనూ, తుఫాను, వర్షాల సమయంలోనూ తమ గ్రామంలో ఉన్న ఊటగెడ్డ కలుషితం అవుతుందని ఈ సమయంలో త్రాగునీటికి కటకటలాడవలసిన పరిస్థితి ఉందని గిరి మహిళలు గగ్గులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కులాయి సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటనలు చేయడం తప్ప కార్యరూపంలో అవి ఎక్కడా కనిపించడం లేదని మహిళలు ఆరోపించారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి తమ గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, ఇదే క్రమంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సామాజిక భవనం అంగన్వాడి భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలని, వీధులలో సిమెంటు రహదారులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొర్ర నూకరాజు, వంతల చిన్నారావు, సుబ్బారావు, లేబు రామారావు, కిల్లో రామారావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.