ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారంనాడు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అది బడ్జెట్టో కాదో తెలియక కొద్దిసేపు దేశీయ మార్కెట్ సందిగ్థంలో పడిపోయింది. అది బడ్జెట్లా కాకుండా ఫక్తు ఎన్నికల ప్రసంగంలా సాగింది. గత పదేళ్లలో అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకున్న అంశాలను 85 శాతం ప్రసంగంలో పొందుపరిచారు. అసలు కేటాయింపుల అంశాలను మిగిలిన సమయంలో తూతూ మంత్రంగా చెప్పేసి ముగించారు. మోదీ రాసిన కరపత్రాన్ని తప్పుల్లేకుండా చదవి విన్పించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ను ఏనాడూ చూడలేదని రాజకీయవర్గాలు పెదవి విరిచాయి. గత పదేళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు, వాస్తవాలకు ఏ మాత్రం పొంతన లేదు. పైగా వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగాన్ని తలపించింది. ‘డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ’ వంటి పదాలు ఉచ్ఛరించి ఏదో ఉన్నట్లు భ్రమింపజేశారు. జీడీపీ అంటే గవర్నెన్స్, డవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అని కొత్త భాష్యం చెప్పి, అసలు జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయారు. పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. అందులో కీలకమైన మార్పులైన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుపై సమాధానం లేదు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ప్రజల ఆస్తులను మూకుమ్మడిగా అప్పగించడమే లక్ష్యంగా మోదీ చేపట్టిన సంస్కరణలను ఈ ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా కొనసాగించాలని నిర్ణయించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెపుతూనే, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని ప్రకటించారు. పేదరిక నిర్మూలన జరిగినప్పుడు ఉచిత రేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందనే అంశంపై సమాధానం లేదు. 130 కోట్ల మంది ప్రజల్లో నేటికీ 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా, 4 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పి అన్నదాత పట్ల తమ కంటితుడుపు చర్యలను తమకుతామే బయటపెట్టుకున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు. ఆ లెక్కన గత పదేళ్లలో 20 కోట్లమందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. భారత్లో నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా పెరిగిందని, పేదరికంలో దేశం ఏ మాత్రం తగ్గలేదని ప్రపంచ నివేదికలే చెపుతున్న విషయాన్ని నిర్మల విస్మరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ ధన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశామని నిర్మల చెప్పారు. అందులో ఏ పథకాలు ఉన్నాయో విభజన లేదు. దేశ సంపదలో మహిళల ఆస్తుల విలువ 2 శాతం నుంచి ఒక్క అంగుళం కూడా మారలేదు. ఈ జన్ధన్ డబ్బులు ఎవరికి వెళ్లాయో తెలీదు. ‘లక్పతి దీదీ’ పేరుతో పెట్టిన కొత్త పథకం ఎన్నికల కోసం ఉద్దేశించిందే. రాష్ట్రాలకు సహకారం ఇస్తున్నామని చెప్పారు. మోదీ పాలనలో గవర్నర్ల అరాచకంతో ఎన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయో సర్వవిదితం. సమాఖ్య వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైనా, జీఎస్టీ బకాయిలతో రాష్ట్రాలు విలవిలలాడుతున్నా, బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నా… అవేవీ నిర్మల ప్రసంగంలో కానరాలేదు.
మౌలిక వసతుల రంగానికి 11.11 శాతం వృద్ధితో రూ.11.11 లక్షల కోట్లను కేటాయించామని, ఈ పెట్టుబడులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిర్మల ప్రకటించి, పెట్టుబడిదారులను సంతోషపెట్టారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాల్సి ఉంటుందని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు. కానీ, ఇందుకు అవసరమైన 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ ప్రోగ్రామ్ ఈ ఏడాది మార్చితో ముగియనున్నప్పటికీ, దీని పొడిగింపుపై బడ్జెట్లో ప్రకటనే చేయలేదు. బంగారం అక్రమ రవాణాపై ఎలాంటి ప్రకటన లేదు. దీని ఫలితంగానే స్టాక్ మార్కెట్ ట్రేడిరగ్లో దానికి సంబంధించిన షేర్లు పడిపోయాయి. పద్దులో వేతన జీవులకు ఊరట లభించలేదు. ఎన్నికల నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పుల జోలికి కేంద్రం వెళ్లలేదు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో నివసించేవారు తమ సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా ‘హౌసింగ్ స్కీమ్’ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు అమల్లో ఉన్న హౌసింగ్ స్కీమ్ల వైఫల్యాన్ని ప్రస్తావించలేదు. సామాన్యులపై విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేలా ‘రూఫ్ టాప్ సోలారైజేషన్’ పథకాన్ని అమలు చేయనున్నారు. వ్యవసాయ సాగులో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులు (పీపీపీ విధానం) పెంచాలని నిర్ణయించినట్లు చెప్పి, సాగును ప్రైవేటుపరం చేయడానికి మరో ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడైంది. వికసిత్ భారత్, ఐదు లక్ష్యాలు, సామాజిక న్యాయం వంటి పదాలు వల్లించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ తాత్కాలిక బడ్జెట్లో మూలధన వ్యయాన్ని 11.11 లక్షల కోట్లకు పెంచారు. మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని చెబితే.. దానికి అటల్ బిహారీ వాజ్పేయీ ‘జై విజ్ఞాన్’ను కలపగా, ప్రధాని మోదీ కొత్తగా వాటికి ‘జై అనుసంధాన్’ను జోడిరచారని చెప్పడంతో అధికార పక్ష ఎంపీలు బల్లలు చరిచారు. రైల్వేలో మూడు కారిడార్లు, 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ స్థాయికి తీసుకువెళ్లడం, విమానాశ్రయాలను 149కి పెంచామని చెప్పారు. జాతీయ రహదారుల కోసం బడ్జెట్లో ఈసారి రూ.2.78 లక్షల కోట్లు కేటాయించారు.
ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్కు మోదీ సర్కారు ఇంకోసారి మొండిచేయి చూపింది. గతంలో ఆంధ్రాకు పార్లమెంటు ఇచ్చిన హామీలపై ఒక్క మాట కూడా లేదు.