. నోటిఫికేషన్ జారీ చేసిన మంత్రి బొత్స
. జిల్లాల వారీగా ఖాళీల వెల్లడి
. జీవోలు 11, 12 విడుదల
. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ 2024 నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్తో కలిసి డీఎస్సీ 2024 ప్రత్యేక వెబ్సైట్ను, డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జీవోలు (11, 12)లను మంత్రి సోమవారం విడుదల చేశారు. అనం తరం డీఎస్సీ 2024 ఖాళీలు, పరీక్షల వివరాలను మంత్రి బొత్సతోపాటు ప్రవీణ్ ప్రకాశ్, సురేశ్కుమార్ వెల్లడిరచారు. డీఎస్సీ 2024 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ (సోమవారం) నుంచి 22 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. డీఎస్సీ పరీక్షల రుసుము ఈనెల 21లోగా చెల్లించాలి. మొత్తం ఖాళీల్లో ఉమ్మడి 13 జిల్లాల ఆధారంగా వివిధ ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలల్లో ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ) 1,264, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) 215, ప్రిన్సిపాళ్లు 42 చొప్పున ఉన్నాయి. ఈ పోస్టులకు జనరల్ అభ్యర్థుల వయోపరిమితి జులై 1, 2024 నాటికి 18 నుంచి 44 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. వయో పరిమితికి సంబంధించి జనరల్ అభ్యర్థులకు ప్రభుత్వం ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. 2018 డీఎస్సీ సిలబస్ ఆధారంగానే పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 15 నుంచి 30 వరకు (సెలవు రోజులు మినహా) డీఎస్సీ పరీక్షలను ప్రతి రోజూ రెండు సెషన్లుగా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 122 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. సెషన్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెషన్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజూ 35 వేల నుంచి 40 వేల మంది పరీక్షలు రాసేందుకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్లను 5వ తేదీన ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి, ఏప్రిల్ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి, ఫలితాలు 7న వెల్లడిస్తారు. డీఎస్సీ పరీక్షలను 80 మార్కులకు నిర్వహిస్తారు. టెట్లో 20 శాతం వెయిటేజీ, డీఎస్సీలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రతిభా జాబితా రూపొందిస్తారు. డీఎస్సీ 2024 సిలబస్, పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. డీఎస్సీకి సంబంధించిన ఫిర్యాదులు, సందేహాల నివృత్తి కోసం పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్లు 9505619127, 9705655349ను ఏర్పాటు చేశారు.