ప్రత్యేక పలస్తీనా ఉండదు
నెతన్యాహు ‘డే ఆఫ్టర్’ ప్రతిపాదన
జెరూసలేం: గాజాలో భీకర పోరు సాగిస్తూ భారీగా పౌర మరణాలకు ఇజ్రాయిల్ కారణమవుతోంది. యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. యావత్ ప్రపంచం ఆక్షేపిస్తున్నా ఏకపక్షంగా ముందుకెళుతోంది. హమాస్ అంతమే లక్ష్యమని మారణహోమాన్ని సమర్థించుకుంటోంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల అండదండలతో మరింతగా రెచ్చిపోతోంది. గాజాలో దుర్భర పరిస్థితులు కల్పించింది. ఆ ప్రాంతాన్ని డెత్జోన్గా మార్చింది. గాజా, వెస్ట్బ్యాంక్తో పాటు పశ్చిమ జోర్డాన్ భూములపై భద్రతా పరంగా ఇజ్రాయిల్ నియంత్రణ ఉంటుందని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పేర్కొన్నారు. పలస్తీనా వేరొక దేశంగా గుర్తించేందుకు నిరాకరించారు. నెతన్యాహు ‘డే ఆఫ్టర్’ పేరిట గాజా కోసం ప్రతిపాదన చేశారు. సంబంధిత పత్రాన్ని ఇజ్రాయిల్ భద్రతా కేబినెట్ ముందురుంచారు. పోరు ముగిశాక గాజాలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది అందులో వివరించారు. ప్రత్యేక పలస్తీనా అసాధ్యమని నొక్కిచెప్పారు. రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే పలస్తీనీయన్లతో రాజీ సాధ్యమన్నారు. అయితే పలస్తీనా తరపున ప్రాతినిధ్యం ఎవరు వహిస్తారో వెల్లడిరచలేదు. అమెరికా, ఈజిప్టు సహకారంతో రఫా క్రాసింగ్ సహా గాజా`ఈజిప్టు సరిహద్దులు తమ నియంత్రణలో ఉంటాయని, చొరబాట్లు అడ్డుకుంటామని తెలిపారు. గాజాలో హమాస్ పాలనను అంతం చేస్తామన్నారు. స్థానిక ప్రతినిధులు (ఉగ్రవాద సంస్థలు లేక దేశాలతో అనుబంధం లేని వారు. ఆర్థికంగా మద్దతివ్వని వారు)తో కలిసి పనిచేస్తామన్నారు. ఐరాస పలస్తీనియన్ శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ)ను మూసవేసి ఇతర అంతర్జాతీయ సహాయ సంఘాలకు అవకాశమిద్దామన్నారు. నెతన్యాహు ప్రతిపాదన కేబినెట్ పరిశీలనలో ఉంది.
నెతన్యాహు ప్రతిపాదన పనిచేయదు: పలస్తీనా అధ్యక్షుడు
నెతన్యాహు చేసిన ప్రతిపాదన విఫలమవుతుందని పలస్తీనియా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అన్నారు. భౌగోళికంగానే కాకుండా ప్రజలకు సంబంధించి గాజాలో వాస్తవాలను తోసిపుచ్చి ఎలాంటి మార్పు చేసేందుకు జరిగే ప్రయత్నాలు, ఇజ్రాయిల్ ప్రణాళికలు ఫలించబోవన్నారు. ఈ ప్రాంతంలో భద్రతా, సుస్థితరకు ప్రపంచం నిజంగా కట్టుబడి ఉంటేగనుక పలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ దురాక్రమణను ముగించాలి, జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పలస్తీనాను గుర్తించాలని అబ్బాస్ స్పష్టంచేశారు.