వినాశకారి ఇజ్రాయిల్ను ఆపండి : 2న అంతర్జాతీయ నిరసనకు పలస్తీనియన్ల పిలుపు
జెరూసలేం: గాజా, వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిల్ మారణహోమం కొనసాగిస్తోంది. యుద్ధం మొదలై ఐదు నెలలు కాగా ఇప్పటివరకు 30వేల మంది పలస్తీనియన్లు మరణించారు. దీంతో ఇజ్రాయిల్ నరమేధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని పలస్తీనియన్లు పిలుపునిచ్చారు. మార్చి 2న అంతర్జాతీయ స్థాయిలో నిరసన తెలిపే విధంగా జన సమీకరణ జరగాలన్నారు. ఇజ్రాయిల్కు మద్దతిచ్చే పశ్చిమ దేశాలపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా అమెరికా సైనికుడు ఆరన్ బుష్నెల్ వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయిల్ దౌత్యకార్యాలయం ఎదుట నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన మరుసటి రోజు బైడెన్ పై వ్యాఖ్యలు చేశారు. మానవాళి పరిరక్షణకు అంతర్జాతీయ పోరు తప్పదని లెఫ్ట్ పలస్తీనియన్ రెసిస్టెంట్ గ్రూపు, ది పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పలస్తీనా (పీఎఫ్ఎల్పీ) ఓ ప్రకటనలో పేర్కొంది. గాజాలో ప్రజలకు వ్యతిరేకంగా విశాసకారి పోరు సాగుతోంది’ అని దుయ్యబట్టింది. అంతర్జాతీయ స్థాయి పోరాటం, మానవుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతమవుతాయని హెచ్చరించింది. 2023, అక్టోబరు 7 నుంచి 2024, ఫిబ్రవరి 27 వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 29,878 మంది పలస్తీనియన్లు చనిపోగా, 70,215 మంది గాయపడినట్లు పలస్తీనా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
చిన్నారుల్లో ఆకలిచావులు మొదలయ్యాయని, తక్షణమే మానవతా సాయం అందకపోతే ఈ సంఖ్య తారస్థాయికి చేరుకోగలనదని హెచ్చరించింది. గాజా జనాభాలో 25శాతం కరువు గుప్పిట్లో ఉన్నట్లు ఐరాస మానవతా వ్యవహారాల విభాగాధ్యక్షుడు రమేశ్ రాజసింగం తెలిపారు. కాగా, వెస్ట్బ్యాంక్లో 108 మంది పిల్లలతో పాటు 409 మంది చనిపోగా ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో 7,255 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది.