జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మారుమూల గ్రామాలకు రహదారుల సౌకర్యం వైకాపా ప్రభుత్వంలోనే సాధ్యమైందని జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. మండలంలోని మారుమూల పంచాయతీ అయినా అంజలి శనివారంలో పంచాయతీ కేంద్రం నుండి చిక్కుడు వీధి గ్రామానికి కిలోమీటరు గ్రావెల్ రహదారి నిర్మాణానికి సిపిఐ పార్టీకి చెందిన ఆ పంచాయతీ సర్పంచ్ పేట్ల రాజబాబు, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావుతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని, ఆ ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకుని ఉంటే ఈ రోజు రహదారి సౌకర్యం లేని గ్రామాలు ఉండేవి కావన్నారు. అందులో భాగంగానే ఈరోజు అంజలి శనివారం గ్రామం నుండి చిక్కుడు వీధి గ్రామానికి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడమే గాక, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కృషితో మిషన్ కనెక్టివిటీ పాడేరు అనే పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని అనేక మారుమూల గిరి గ్రామాలకు గ్రావెల్ రహదారుల నిర్మాణం సర్వేగంగా జరుగుతుందన్నారు. అంజలి శనివారం పంచాయితీ లోనే తామరపల్లి నుండి ఊబలగరువు వరకు 4 కి.మి, బూసులకోట నుండి గడ్డిబంద వరకు 3 కిలోమీటర్లు, గడ్డిబంద నుండి తాటిబంద వరకు 2కిమీ,. ఈదులుబయలు నుండి దోనిబంద వరకు, అంజలి శనివారం నుండి పోర్లుబంద వరకు, పాతమాడెం నుండి గున్న మామిడి వరకు గ్రావెల్ రహదారి పనులు శరవేగంతో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కేవలం ఒకే పంచాయితీ లో ఇన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయించిన వైకాపా అభ్యర్థి మత్యరాస విశ్వేశ్వరరాజు ను, అరకు పార్లమెంటు అభ్యర్థి గా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మన్య ప్రాంతంలో వైకాపా హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తామని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిముడు ఉత్తర కుమారి, సచివాలయం కన్వీనర్ కిముడు లక్ష్మణరావు,మాజీ సర్పంచ్ కిముడు బెన్నలింగం, మాజీ ఎంపిటిసి, సిపిఐ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు, వార్డు సభ్యులు జఢుమూరి బాబురావు, వైకాపా సీనియర్ నాయకులు అంగదరావు, రామారావు, బూసరి కృష్ణారావు, గబులంగి మోహన్ రావు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.