వాడ్రేవు చినవీరభద్రుడు
తెలుగులో గొప్ప నవలలు, కథలు ఎన్నో వచ్చాయి. ఒక జాతి తన కథల్ని దృశ్యశ్రవణమాధ్యమాలుగా ఎంత సమర్థవంతంగా మార్చుకోగలిగితే ఆ జాతి అంత చైతన్యవంతంగా ఉందని చెప్పవచ్చు. అలా మలచుకుంటూ తెలుగు నాటకం తిరిగి ప్రాణం పోసుకుంటోంది. నిజానికి చాలాకాలం కిందట మాలపల్లి నవలని నగ్నముని నాటకీకరించడంతో ఈ ప్రయత్నం మొదలయ్యిందికాని, మధ్యలో చాలా పెద్ద విరామమే నడిచింది. ఇప్పటికే రెండు సుప్రసిద్ధ తెలుగు నవలలు, ‘మైదానం’, ‘పాకుడురాళ్ళు’ నస్రీన్ ఇషాక్ దర్శకత్వంలో నాటకీకరించడంతో తెలుగు నాటకంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యిందని చెప్పవచ్చు. ప్రసిద్ధ నాటకరచయిత వల్లూరి శివప్రసాద్ గారు వాసిరెడ్డి సీతాదేవి ‘మట్టిమనిషి’ నవలను నాటకీకరణ చేశారు. ఆ నాటకమే డా. వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ వారి సహకారంతో నస్రీన్ దర్శకత్వంలో రంగస్థలంపై ప్రదర్శించారు.
మట్టిమనిషి యాభై ఏళ్ళ కింద వెలువడ్డ నవల. అరవైల్లో, డెబ్భయిల్లో తెలుగు గ్రామసీమ పట్టణీకరణ, నగరీకరణ చెందుతున్న కాలం నాటి సంఘర్షణను విస్తృతంగా చిత్రించిన నవల. వ్యవసాయాన్నీ, రెక్కల కష్టాన్నీ మాత్రమే నమ్ముకున్న ఒక రైతు కుటుంబంలో, అతడి తర్వాతి తరం పట్టణ జీవితాన్నీ, పెట్టుబడినీ, సినిమా వ్యాపారాన్నీ కోరుకోడంతో, ఆ కుటుంబ జీవితం పెద్ద మలుపు తిరుగుతుంది. రెండవ తరం చేసిన పొరపాట్ల వల్ల మూడోతరం అనాథగా మారినప్పుడు, ఆ పిల్లవాడు తిరిగి తన తాత దగ్గరికి చేరుకుంటాడు. ఆ తాతామనవలిద్దరూ మళ్లా మట్టిని నమ్ముకున్న మనుషులుగా సేద్యం మొదలు పెట్టడంతో కథ పూర్తవుతుంది.
ఇంత నేలని వ్యవసాయభూమిగా మార్చి ఏడాదిపాటు రెక్కలు ముక్కలు చేసుకుని సాగుభూమిగా మార్చడం కన్నా అక్కడొక సినిమా హాలు కట్టడం ఎక్కువ లాభదాయకం అనీ, తొందరలోనే పెట్టుబడి రెండిరతలూ, మూడిరతలూ అవుతుందని నమ్మిన కాలం నాటి కథ మట్టిమనిషి. ఆ జూదం చివరికి మానవసంబంధాల్ని ఎలా భగ్నం చేస్తుందో, చెమట, పంట, పండగల ప్రపంచంలోకి తాగుడు, అక్రమసంబంధాలు, కోర్టుకేసులు, హత్యలు, జైళ్ళు ఎలా వచ్చిచేరతాయో ఆ వికృతత్వం తాలూకు సహజపరిణామాన్ని మట్టిమనిషి నాటకం ఎంతో బలంగా కళ్ళముందు కదలాడేట్టు చేసింది.
ఆ నాటకం చూస్తున్నంతసేపూ, ఆ కథాంశానికి కాలం చెల్లలేదనీ, ఇప్పుడు మన సమాజంలో మట్టిమనిషి వెర్షన్ 2.0 నడుస్తోందనీ నాకు పదే పదే అనిపించింది. ఇప్పుడు సాగుభూమిని సినిమాహాలుగామార్చి పెట్టుబడిని రెండిరతలు, మూడిరతలు చేసుకోడం మీద కాదు, ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ పాచికగా మార్చి, పెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే పదింతలు చేసుకోవాలనే రాక్షసదురాశ ఆవహించిన కాలంలో ఉన్నాం. ఆ మాయలో పడి ఎన్ని జీవితాలు, ఎన్ని దాంపత్యాలు, ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయో, ఆ కథల్ని బలంగా చెప్పగల రచయితలూ, ఆ కథల్ని కళారూపాలుగా మార్చగల దర్శకులే చాలినంతమంది లేరిప్పుడు!
నిభా థియేటర్ ఎన్ సెంబుల్ వారు ఈ నవలల్ని నాటకాలుగా మార్చేటప్పుడు సాంప్రదాయికంగా అంకాల వారీ నాటకాలుగా కాకుండా బ్రెప్ట్ా తరహాలో వజూఱంశీసఱష కథాగమనాలుగా మారుస్తున్నారు. ఈ నవలని నాటకంగా మార్చినప్పుడు కూడా తెంపులేని సన్నివేశమాలికగా కథని ప్రదర్శించడంతో కథాగమనంలో వేగం, ఉత్కంఠ చోటుచేసుకున్నాయి. అంకాల వారీగా ఉండే సాంప్రదాయిక నాటకంలో పాత్రల మనోధర్మంతో ప్రేక్షకుడు ఎక్కువ మమేకం కావడానికి వీలుంటుంది. కాని ఇక్కడ పాత్రలకన్నా కథ ప్రధానం, సంఘటనలు ప్రధానం, సమాజాన్ని నడిపిస్తున్న శక్తుల గురించి ప్రేక్షకుడికి కలిగించే జాగృతి ప్రధానం. ఈ రెండు పద్ధతుల్లో ఏది మేలైనది అన్నది చెప్పడం కష్టం.
నాటకం పూర్తయ్యాక అంతిమంగా లెక్కకొచ్చేది, ప్రదర్శన సఫలమయిందా లేదా అన్నది మాత్రమే.
నాటకంలో ప్రతి ఒక్క పాత్రధారీ తన పాత్రకి న్యాయం చేసాడనే చెప్పాలి. కాని పాకుడురాళ్ళులో మంజరి లానే ఈ నాటకంలో కూడా వరూధిని పాత్రధారి తక్కిన పాత్రలకన్నా ఒక మెట్టు ఎక్కువగానే కథని నడిపించింది అని చెప్పవచ్చు. గ్రామం పట్టణంగా మారడంలోని జిగిబిగి, గజిబిజి, మిలమిల, తళతళ మొత్తం ఆమె రూపరేఖావిన్యాసాల్లో విస్మయకరంగా రూపుకట్టిందని చెప్తే అతిశయోక్తి కాదు. ఆమె తర్వాత స్థానంలో వెంకటపతి పాత్రధారి నా ప్రశంసకి నోచుకుంటాడు.
ఇది తొలిప్రదర్శన అనీ, తర్వాత ప్రదర్శనల్లో మరింత మెరుగుపర్చుకుంటాం అనీ నాటకబృందం చెప్పుకున్నారు. వారు దృష్టి పెట్టవలసిన అంశాలు ఒకటి రెండున్నాయి. మొదటిది, నాటకం మొదట్లో సాంబయ్య పాత్రను నిర్మిస్తున్నప్పుడు, అతడికి పొలం తప్ప మరేదీ పట్టదని చెప్పే క్రమంలో అతణ్ణి పిసినారిగానూ, భార్య మరణానికి కూడా చలించని రాతిమనిషిగానూ చిత్రించారు. ఆ రకమైన అభిప్రాయం నవల్లోనే ఉందేమో నాకు తెలియదు. కాని అది పాత్ర ఔచిత్యాన్ని భంగపరుస్తున్నది. అలాగే రామనాథబాబుకీ, వరూధినీ మధ్య దూరం పెరగడాన్ని చిత్రించేటప్పుడు అందుకు కారణాల్ని ఎప్పటికప్పుడు మరింత స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. తిట్లు, ముఖ్యంగా స్త్రీలని కించపరిచే లాంటి తిట్లు గ్రామీణ సమాజంలో సాధారణమే అయినప్పటికీ, వాటిని రంగస్థలం మీద ప్రయోగించడం విషయంలో చాలా జాగ్రత్తవహించాలి. అసలు ఆ తిట్లు వాడకుండానే సంభాషణల్ని నడపగలమనే నా నమ్మకం.
ఏమైనప్పటికీ ఒక ప్రయోజనకరమైన, అభ్యుదయచైతన్యం కలిగిన, మానవతా పరిమళాన్ని వెదజల్లుతున్న ఒక నాటకాన్ని మనముందుకు తీసుకొచ్చినందుకు వల్లూరి శివప్రసాద్ గారికీ, నస్రీన్ ఇషాక్ గారికీ, నాటకప్రదర్శనకు ఆర్థికంగా మద్దతునిచ్చిన డా.వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ వారికీ, రసరంజని వారికీ మరోమారు నా హృదయపూర్వక ధన్యవాదాలు.