ఏ ఐ ఎల్ యు. జిల్లా ఉపాధ్యక్షుడు ఇడపబత్తిని ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజల రాజ్యాంగ హక్కులను భంగపరిచే విధంగా గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు తమ ద్వితీయ సంతకాన్ని చేయడం పై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇడప బత్తిని ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, ఆంధ్ర ప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు కోరుతూ చేసిన ఉద్యమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ చురుకైన పాత్ర పోషించిందని,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలని రిట్ పిటీషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం కూడా చేయటం జరిగిందన్నారు. ప్రజల ఆస్తి హక్కును హరించే ఈ చట్టాన్ని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే రద్దు చేసి ప్రజల ఆందోళనను తగ్గించి, వారి ఆకాంక్షను నెరవేర్చటం పై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేస్తున్నది అని తెలిపారు. శాసనసభ లో కుడా ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ, బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేయాలని కోరారు.ఇటీవల కాలంలో తమ విధులను సక్రమంగా నిర్వహించుచున్న న్యాయవాదులపై అనేక భౌతిక దాడులు జరగటం బాధాకరం. ఈ దాడులను అరికట్టడానికి న్యాయవాదుల రక్షణ చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని తెలిపారు.కావున నూతన ప్రభుత్వం. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించవలసినదిగా వారు కోరారు.