రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర – ధర్మవరం: రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యుడు మహేష్ బాబుకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు, జ్ఞాపిక, సత్కారం లభించడం సంతోషించదగ్గ విషయమని రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతపురం పట్టణానికి చెందిన జూటూరుమహేష్ బాబు ఇప్పటివరకు 77 సార్లు రక్తదానం చేయడం జరిగిందని, ప్రపంచ రక్త దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ వినోద్ కుమార్ చేతులు మీదుగా జ్ఞాపిక అందుకొని, ఘనంగా సత్కరించడం, రక్త బంధం ఆర్గనైజేషన్ సంస్థకు మంచి గుర్తింపుతో పాటు మరింత బాధ్యతలు పెంచిందని తెలిపారు. కలెక్టర్ కూడా రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్త దాతలుగా రక్త బంధం ఆర్గనైజేషన్లో అడిగిన వెంటనే రక్తమును ఇవ్వడం ఎందరో ప్రాణాలను కాపాడటం గర్వించదగ్గ విషయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు విలువ కట్టలేమని వారు స్పష్టం చేశారు. 18 సంవత్సరాల నుండి 45 కేజీల బరువు వరకు ఎవరైనా లింగ బేధం లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని తెలిపారు. యువతి యువకులు ఈ రక్త బంధం ఆర్గనైజేషన్ ను స్ఫూర్తిగా తీసుకొని, మానవతకు సంకేతం అని తెలిపారు. కావున ప్రతి మనిషి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని వారు తెలిపారు. అనంతరం రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తో పాటు సభ్యులు కూడా మహేష్ బాబును అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.