విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి మహోత్సవ్ – 2024 సందర్భంగా ఇండియన్ ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా మోటార్ సైకిల్ దక్షిణ ప్రాంత (డి5 మోటార్ సైకిల్) యాత్రను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అథితిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ కు కార్గిల్ విజయ్ దివస్ మోటార్ సైకిల్ క్యాప్, మెమెంటో ను ఆర్మీ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ కుమార్ నాయర్, కెప్టెన్ ఆదర్శ్ జన్మేదా లు అందించి కలెక్టర్ ను గౌరవ పూర్వకంగా సన్మానించారు.
కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి మహోత్సవ్ -2024 ఉత్సవాలలో భాగంగా ఇండియన్ ఆర్మీ ఆర్టిల్లరీ విభాగం డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో దేశం నలుమూలల నుండి ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా మోటర్ సైకిల్ దక్షిణ ప్రాంత యాత్ర ధనుష్కోడి నుండి బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లాకు ఆదివారం సాయంత్రం చేరుకోగా, అనంతపురం నుంచి జమ్మూ కాశ్మీర్ లో ద్రాస్ లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ చేరుకునే ఇండియన్ ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా మోటార్ సైకిల్ దక్షిణ ప్రాంత (డి5 మోటార్ సైకిల్) యాత్రను జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ సోమవారం ఉదయం జెండా ఊపి మోటర్సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఆర్మీ మోటార్ సైకిల్ యాత్ర సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని, నాగపూర్, గ్వాలియార్, ఢిల్లీ మీదుగా జమ్మూ కాశ్మీర్ ద్రాస్ లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ కు జూలై 26 లోపు చేరుకుంటుంది.
ఈ సందర్భంగా అనంతపురము జిల్లా నుండి కార్గిల్ ప్రాంతంలో ఆర్మీ విధులు నిర్వహించిన మాజీ సైనికులు ఉమా మహేశ్వరరావుతో పాటు మొత్తం నలుగురు మాజీ సైనికులను జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ కుమార్ నాయర్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప, కెప్టెన్ ఆదర్శ్ జన్మేదా తదితరులు కార్గిల్ విజయ్ దివస్ బ్యాడ్జ్ లతో సన్మానం చేసారు. అనంతరం, మాజీ సైనికులు, ఎన్సీసీ విద్యార్థులతో కార్గిల్ విజయ్ దివస్ ఆర్మీ మోటార్సైకిల్ యాత్ర జవాన్లతో జిల్లా కలెక్టర్ గ్రూప్ ఫోటో దిగి యువతలో స్ఫూర్తిని నింపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ మన భారత దేశ సరిహద్దులో 25 సంవత్సరాల క్రితం మన ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడి, ప్రాణాలు సైతం పొగుట్టుకుని మన దేశానికి కార్గిల్ యుద్ధ విజయాన్ని అందించారని, కార్గిల్ విజయ్ దివస్ ఈ జూలై 26 తో రజతోత్సవం జరుపుకుంటుందని.. ఇందులో భాగంగా కార్గిల్ వీరులను స్మరించుకుంటూ .. దేశం నలుమూలలా యువత, మాజీ సైనికులు, ప్రజలలో దేశభక్తి , కార్గిల్ వీరుల స్ఫూర్తిని నింపడం కోసం ఇండియన్ ఆర్మీ అధ్వర్యంలో దేశం నలుమూలలా…ధనుష్కోడి, ద్వారకా, డింజెన్, ఢిల్లీ నుండి కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి మహోత్సవ్ డి-5 మోటర్ సైకిల్ యాత్ర ప్రారంభమైందని , జూలై 26న జమ్మూ కాశ్మీర్ లో ద్రాస్ లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ చేరుకుని కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ మహోత్సవాలను ఇండియన్ ఆర్మీ జరుపుకుంటుందని తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న మాజీ సైనికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
కార్గిల్ విజయ్ దివస్ ఆర్మీ మోటార్సైకిల్ యాత్ర ఇన్చార్జ్ లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ కుమార్ నాయర్, కెప్టెన్ ఆదర్శ్ జన్మేదా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప, మాజీ సైనికులు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ మోటార్ సైకిల్ దక్షిణభారత యాత్ర ధనుష్కోడి నుండి ప్రారంభమై..మధురై, కోయంబత్తూర్, బెంగళూరు మీదుగా ఆదివారం అనంతపురం చేరుకున్నామని, అధికారులు అన్ని ఏర్పాట్లు బాగా చేశారని, సోమవారం ఉదయం 6:30 గంటలకు జిల్లా కలెక్టర్ పిటీసీ స్టేడియం నుండి ఫ్లాగ్ ఆఫ్ చేశారన్నారు. అనంతరం హైదరాబాద్ మీదుగా నాగపూర్, గ్వాలియర్, ఢిల్లీ, కార్గిల్ చేరుకుంటారని లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ కుమార్ నాయర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, మాజీ సైనికులు, అలాగే ఎన్సీసీ అధికారులు, స్టూడెంట్స్, ట్రాఫిక్ సీఐ నారాయణ రెడ్డి, కార్గిల్ మోటార్ సైకిల్ యాత్ర సమన్వయ అధికారి సుబేదార్ సిద్దప్ప, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది గిరీష్, బాబా , అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.