. 9 మంది మృతి… 41 మందికి గాయాలు
. గాల్లోకి లేచిన బోగీ… పట్టాలు తప్పిన మరో రెండు బోగీలు
. బెంగాల్లో ఘోర ప్రమాదం
. కాంచనగంగ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్
న్యూజల్పాయ్గురి/కోల్కతా : పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్పాయ్గురి సమీపంలో కాంచనగంగ ఎక్స్ప్రెస్ను వెనక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా, 41 మందికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం… అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచనగంగ ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూజల్పాయ్గురి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా, ఎక్స్ప్రైస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారని, 41 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడిరచారు. ప్రమాద సమాచారం తెలియగానే రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదం ఏడాది క్రితం ఒడిశాలోని బహనాగ బజార్ సమీపంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనను గుర్తుకు తెచ్చింది. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించగా… వెయ్యిమందికి పైగా గాయాలపాలయ్యారు. 13174 నంబరు కాంచనగంగ ఎక్స్ప్రెస్ అగర్తల నుండి సీల్దాకు బయల్దేరగా… ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి…అక్కడి నుంచి బైక్పై ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన వెంటనే నేరుగా క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. రైలు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని మీడియా మాట్లాడుతూ అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ‘సహాయచర్యలు పూర్వయ్యాయి. పునరుద్ధరణ పనులపై దృష్టి సారించాం’ అని మంత్రి తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించి విపక్షాల విమర్శలపై ప్రశ్నించగా… ఇది రాజకీయాలకు సమయం కాదని వారించారు. కాగా, రైలు ప్రమాదంలో మరణించిన వారిలో గూడ్స్ రైలు లోకోపైలట్, ఎక్స్ప్రెస్ రైలు గార్డ్ సహా ముగ్గురు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు.
వివిధ రైళ్లు రద్దు…దారి మళ్లింపు
ప్రమాద నేపథ్యంలో ఆ మార్గంలో వివిధ రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడిరచింది. 19 రైళ్లు రద్దు చేశామని… మరో 9 రైళ్లు దారి మళ్లించినట్లు వివరించింది. అందులో దిబ్రుఘడ్-న్యూదిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, హౌరా-న్యూజల్పాయిగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నాయని తెలిపింది. రద్దు చేసిన రైల్వే సర్వీసులను ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడిరచింది.
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడిరచారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నట్లు వైష్ణవ్ తొలుత పేర్కొన్నారు. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పరస్పర సహకారంతో పని చేస్తున్నాయని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఘటనా స్థలికి సీనియర్ ఉన్నతాధికారులు చేరుకున్నారని పేర్కొన్నారు.