. పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది
. 72 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చారు
. డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలకు తీవ్ర నష్టం చేశారు
. ఈ ఘోర తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారో తేలాలి
. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు
. రెండు గంటలు ప్రాజెక్టు సైట్లో పర్యటన, సమీక్ష
విశాలాంధ్ర – బ్యూరో ఏలూరు : ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును మాజీ సీఎం జగన్ మూర్ఖత్వం, అహంకారంతో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిని చూస్తే బాధేస్తోందని, ప్రాజెక్టుకు జరిగిన నష్టం చూస్తే జగన్ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి అని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నాటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం ఒక కేస్ స్టడీ లాంటి దన్నారు. పోలవరం విషయంలో జగన్ క్షమించ రాని తప్పు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబునాయడు తొలిసారి పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించారు. ఉదయం 11.40కి ప్రాజెక్టు సమీపాన ఉన్న హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. మంత్రులు, జలవనరుల శాఖ అధికారులు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం క్షేత్ర స్థాయిలో కలియదిరిగి ప్రాజెక్టు వద్ద పరిస్థితిని చూశారు. స్పిల్ వే, కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్తో పాటు 22, 23 గేట్ల దగ్గర నుండి ప్రాజెక్ట్టును పరిశీలించారు. ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్ బండ్ ప్రాంతానికి వెళ్ల్లారు. గ్యాప్-3 ప్రాంతం, ఎగువ కాఫర్ డ్యాం ప్రాంతాన్ని పరిశీలిం చారు. మొత్తం ప్రాజెక్టును నిశితంగా పరిశీలించిన సీఎం… అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయా ఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాం తాన్ని సందర్శించారు. అధికారులతో సమీక్ష నిర్వహిం చాక చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ… అయిదేళ్ల తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తి
‘పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రానికి కరువు అనేది లేకుండా చేయొచ్చని భావించాం. 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రాజెక్టుకు డిజైన్ చేశాం. 194 టీఎంసీల నీళ్లు ప్రాజెక్టులో నిల్వ ఉంచుకుంటే వరద నీటితో కలిపి 320 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలవుతుంది. తద్వారా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమకు ఈ నీటిని ఇవ్వొచ్చు. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిలో 99 శాతం వాడుకునే అవకాశం ఉంది. 2014-19 మధ్య 72 శాతం మేర పనులు పూర్తి చేశాం. గతంలో నేను సీిఎంగా మొత్తం 30 సార్లు ప్రాజెక్టును సందర్శించా. ఇప్పుడు మళ్లీ 31వ సారి వచ్చాను. నా మనసంతా ప్రాజెక్టుపైనే ఉండేది.కానీ ప్రాజెక్టు కోసం నేను పడ్డ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. భూ సేకరణలో కూడా బాధితులను ఒప్పించి ముందుకు వెళ్లాం. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండర్ అంటూ ఏజెన్సీని, అధికారులను మార్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రెండుసార్లు వచ్చిన వరదలతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 35 శాతం దెబ్బతింది. ప్రభుత్వం దీన్ని కాపాడలేపోయింది. డయాఫ్రం వాల్పై గతంలో మేం ఖర్చు చేసింది రూ.446 కోట్లు అయితే…జగన్ నిర్వాకం వల్ల ప్రస్తుతం రిపేర్లు చేయడానికి రూ.447 కోట్లు అవుతుంది. అయినా పూర్తిస్థాయిలో బాగవుతుందనే నమ్మకం లేదని అధికారులు చెపుతున్నారు. రెండో ప్రణాళిక ప్రకారం సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యామ్ రూ.550 కోట్లతో నిర్మాణం జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్వాకంతో చివర్లో ఉన్న గ్యాప్ పూర్తి చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది, గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. ఇవన్నీ చక్కదిద్దాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో ఇప్పటికీ అధికారుల వద్ద నిర్ధిష్టమైన లెక్కలు లేవు. 2019 నుండి ఏజెన్సీలను మార్చకుండా పనులు కొనసాగి ఉంటే 2020 చివరి