జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో మలేరియా, డెంగీ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగీ నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగి నివారణకు అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో శానిటేషన్, క్లోరినేషన్, స్ప్రేయింగ్, ఫాగింగ్ వంటి పనులు సకాలంలో చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో తమ వంతు కృషి చేయాలని ఆదేశించారు. మలేరియా సిబ్బంది సహకారంతో అన్ని వసతి గృహాలను ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ చేయించుకోవాలని జెడి సాంఘిక సంక్షేమ అధికారికి ఆదేశించారు. గ్రామపంచాయతీ, మునిసిపల్ అధికారులు చెత్త తొలగించడం, మురుగునీరు సక్రమంగా పారేటట్లు చేయాలని, లోలయింగ్ ఏరియాస్ గుర్తించి వాటిని మట్టితో కప్పి పూరించాలని, మురుగునీరు నిల్వ ఉన్న గుంతలలో ఆయిల్ బాల్స్ వేయించాలని, యాంటి లార్వా ఆపరేషన్ కట్టుదిట్టంగా చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని తాగునీటి టాంకులను క్లోరినేట్ చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం జరిగే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పంచాయితీ కార్యదర్శులు, మండల అభివృద్ధి అధికారులు తప్పక పర్యవేక్షించాలని తెలియజేశారు. మత్స్య శాఖకు చెందిన అధికారులు లార్వాను తిని దోమల సంతతి అరికట్టే గాంబూజియా చేపపిల్లలను ఎన్ని ఉత్పత్తి చేస్తున్నారు, ఎక్కడెక్కడ గుంతలలో వదులుతున్నారు వివరాలు పంపాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మలేరియా, డెంగీ వంటి జ్వరాల అదుపునకు కృషి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఆర్ఓ రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, డిపిఓ ప్రభాకర్ రావు, జిల్లా మలేరియా అధికారి ఓబులు, సహాయ మలేరియా అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, మలేరియా విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.