. నిర్వాసితుల సమస్య పరిష్కరించండి
. సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ
విశాలాంధ్ర`విజయవాడ: పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తి కోసం, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి సంబంధించి రూ.33 వేల కోట్ల నిధుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సందర్శించి…నిర్మాణ పరిస్థితులు, నిధులు, అవకతవకల గురించి సీఎం మాట్లాడటాన్ని ఆయన అభినందించారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాల విషయంలో మీరు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది నిర్వాసితుల పునరావాస సమస్య అని రామకృష్ణ స్పష్టంచేశారు. దాదాపు రూ.33 వేల కోట్ల రూపాయలు నిర్వాసితుల కోసం వెచ్చించాల్సి ఉందన్నారు. పార్లమెంట్ ఆమోదించిన భూ సేకరణ చట్టం`2013 ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరగాలని కోరారు. నిర్వాసితుల్లో అత్యధికంగా గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల వారున్నారని, వారందరూ భూములు, ఇళ్లు కోల్పోతున్నారని గుర్తుచేశారు. నిర్వాసితుల అంశం తమ పర్యటనలో ప్రస్తావనకు వచ్చినట్లు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వాసితుల సమస్యను దాటవేయడానికి ప్రయత్నిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. డ్యామ్ నిర్మించడంతోపాటు నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయడం ఎంతో ముఖ్యమని రామకృష్ణ పేర్కొన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడినందున…దీని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పునరావాసం తదితరాలకు నిధులు కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలన్నారు.