. ప్రజా రాజధానిని అపహాస్యం చేసి విధ్వంసం చేశారు
. త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం
. తెలుగుజాతి గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం
. అమరావతిలో చంద్రబాబు విస్తృత పర్యటన
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రానికి అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలని, గత పాలకుల మూర్ఖత్వం వల్ల రెండూ విధ్వంసానికి గురయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజధాని అమరావతిని అపహాస్యం చేసి…విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గురువారం అమరావతి రాజధానిలో దాదాపు నాలుగు గంటలపాటు విస్తృత పర్యటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన, విధ్వంసాలకు గురైన నిర్మాణాలు, శిథిలాలను పరిశీలించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాలను మొదట పరిశీలించారు. అక్కడి నుండి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నాడు రాజధానికి భూమిపూజ జరిగిన వేదిక వద్ద మోకాళ్లపై ప్రణమిళ్లారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గృహాలను పరిశీలించారు. తరువాత న్యాయమూర్తుల కోసం నిర్మించిన భవన సముదాయాలు, మంత్రుల నివాస గృహాలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల, నాలుగవ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్మెంట్లు పరిశీలించారు. ప్రతి నిర్మాణం లోపలికి వెళ్లి ఆయా ఫ్లాట్స్ విస్తీర్ణం, ప్లాన్లో ఉన్న సౌకర్యాలు, డిజైన్ల గురించి అధికారులతో మాట్లాడారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డులో ఉన్న సీఆర్డీఏ భవనం వద్ద మీడియాతో మాట్లాడారు.
ఏ అంటే అమరావతి….పీ అంటే పోలవరం
‘రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు. రైతులు అనేక సవాళ్లను, కేసులను అధిగమించి 1,631 రోజులు ఆందోళనలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారడంతో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో ఆందోళనలు విరమించారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఏపీ అనే పదంలో ఏ అంటే అమరావతి…పీ అంటే పోలవరం. అమరావతి ప్రజారాజధాని. తెలుగువారికి చిరునామాగా ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలకు దశ, దిశ నిర్ధేశిస్తుంది. ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గర్వంగా పనులు చేసుకోవచ్చు. కానీ రాజధానిని జగన్ అతలాకుతలం చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువనీళ్లు ఉండే నది గోదావరి. పోలవరం నిర్మాణం జరిగి నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లివ్వచ్చు. విభజన అనంతరం రాజధాని కట్టుకోవడానికి ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని సీఎం గుర్తు చేశారు. అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు.వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతాయి. ప్రజల్ని సాధికారతవైపు నిలబెట్టవచ్చు. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం పూర్తైతే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. అటువంటి ప్రాజెక్టును సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ ప్రజావేదిక కూల్చి జగన్ పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. పైగా ఇష్టానుసారం విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగు కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. కొన్ని బిల్డింగ్లు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీల భవనాలు, మంత్రుల భవనాలు, గెజిటెడ్ అధికారుల, నాన్ గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణం ప్రారంభించాం. ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిపేశారు. శ్వేతపత్రం విడుదల చేసి రాజధాని ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు వివరాలన్నీ తెలుపుతాం. ప్రజల్లో కూడా గత ప్రభుత్వం విధ్వంసంపై చర్చ జరగాలి. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.
‘తెలుగుజాతి గర్వంగా, గౌరవంగా తలెత్తుకు తిరిగే రాజధాని అమరావతి. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. కేంద్రం 12 విద్యాసంస్థలు ఇచ్చింది. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, మంగళగిరిలో ఎయిమ్స్, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిలో ఎన్ఐటీ, ఒంగోలులో ఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీని ప్రాంతాల వారీగా నెలకొల్పాం. కానీ గత ప్రభుత్వం ఏదీ జగనివ్వలేదు. ముందుకు సాగనివ్వలేదు. రాజధానిపై ఇష్టారీతిన బురదజల్లారు. నిత్యం విషప్రచారం చేశారు. బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్సైడర్ ట్రేడిరగ్ అన్నారు. స్విస్ ఛాలెంజ్లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధాని పెట్టండని శివరామకృష్ణ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే 12 పార్లమెంట్ స్థానాలు ఒకవైపు, మరో 12 పార్లమెంట్ స్థానాలు ఇంకోవైపు ఉండేలా చూసి గుంటూరు సెంట్రల్గా అమరావతిని రాజధానిగా గుర్తించామని చంద్రబాబు వివరించారు.
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట
‘మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఇష్టపడని ఈ రోజుల్లో రాజధాని కోసం ముందుకు వచ్చి రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూములు, ప్రభుత్వ భూముల్లో రోడ్లు, బిల్డింగులు, ఇతర నిర్మాణాలు పోను మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజధాని నుండి వచ్చే సంపదతోనే అమలు చేయవచ్చు. కానీ గత పాలకులు మూర్ఖత్వంతో విధ్వంసానికి పాల్పడ్డారని సీఎం మండిపడ్డారు. బ్రహ్మాండంగా ఉండాల్సిన రాజధానిలో తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలతో కమ్మేసుకుంది. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో అర్హత ఉందా అనేది ప్రజల్లో చర్చ జరగాలి. రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొస్తాం. రాజధానిని పునర్నిర్మిస్తాం. అందరి సహకారం, భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం వెంట మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. రాజధాని రైతులు పెద్దసంఖ్యలో చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారు.