ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర – ధర్మవరం : సమాజ శ్రేయస్సు కొరకే పౌర్ణమి గరుడ సేవను ప్రతినెల నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ, దాతలు, అర్చకుల ఆధ్వర్యంలో పౌర్ణమి గరుడ సేవను సాయంత్రం అత్యంత వైభవంగా భక్తాదుల నడుమ నిర్వహించారు. తొలుత చెన్నకేశవ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఉత్సవ విగ్రహాన్ని మేల తాళాలతో, వేదమంత్రాల నడుమ పల్లకిలో ఆ సీనులు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్ లు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయ ఈవో వెంకటేశులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములలో నిర్వహించే విధంగా ధర్మవరం పట్టణంలో కూడా కొన్ని నెలలుగా ఈ గరుడ సేవను నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు. దాతల సహాయ సహకారములతో ఈ పౌర్ణమి గరుడ సేవను నిర్వహించడం ధర్మవరం ప్రజలు కు ఒక వరంగా మారిందని తెలిపారు. అనంతరం దాతలైన గుర్రం ఇంద్రాణి, గుర్రం శ్రీనివాసులు అండ్ సన్స్.. (శ్రీ వీరభద్ర సిల్క్ ఎంపోరియం) వారిని ఆలయ ఈవో ఆధ్వర్యంలో అర్చకులు చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తాదులు, దాతలు, ఆలయ సిబ్బంది పల్లకిని లాగి ప్రారంభించారు. అనంతరం స్వామి వారు పట్టణ పురవీధులలో ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.