. ప్రజాసేవకు పదవులక్కర్లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి
. అమరావతిలో ఆయన పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
. ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న కోసం కృషి
. సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు
. రాజధానిలో రామోజీ విగ్రహం ఏర్పాటు: పవన్
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రామోజీరావు భావితరాలకు స్ఫూర్తి ప్రదాత అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగర శివారులోని అనుమోలు గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు వ్యక్తికాదు… ఓ వ్యవస్థ అన్నారు. ఆయన ఏ పనిచేసినా ప్రజాహితం కోరుకునేవారు. నీతి, నిజాయతీకి ప్రతిరూపం రామోజీరావు. మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నంబర్వన్గా ఎదిగారు. పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారు. రామోజీరావు నిరంతరం విలువల కోసం బ్రతికారు. ప్రజల కోసం పోరాటం చేశారు. నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్న సమయంలో పరిశోధన చేసి ‘అమరావతి’ పేరు సూచించారు. ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా… ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుంది. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఆయనకు ఎనలేని ఆప్యాయత. పనిచేస్తూ చనిపోవాలని ఆయన కోరుకున్నారు. చివరి రోజుల్లో అదే జరిగింది. దిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా, అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గ్ అని పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకుగాను తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మార్గదర్శి సంస్థ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. చాలా మంది పదవులు ఉంటేనే సేవ చేస్తారు. కానీ ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన, సేవలు అందించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని చంద్రబాబు శ్లాఘించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో ఆయన వివరించారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని అనేవారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలనేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదల్లేదు. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. ఆయన నమ్మిన, పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు, తన తరపున సభా ముఖంగా హామీ ఇస్తున్నానన్నారు. రాజధాని అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం ప్రకటించి ముఖ్యమంత్రికి చెక్ అందజేశారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పేరు రామోజీరావు సూచించారు. ఈ సభ నాన్న ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నాం. సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని కిరణ్ తెలిపారు. సభలో మంత్రి కొలుసు పార్థసారధి, హిందూ మాజీ సంపాదకులు ఎన్.రామ్, ప్రముఖ దర్శకులు రాజమౌళి, కీరవాణి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తదితరులు ప్రసంగించారు.