స్పీకర్ వద్ద ప్రతిపక్ష నేత రాహుల్ అసంతృప్తి
‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన
న్యూదిల్లీ : లోక్సభ స్పీకర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్సభలో తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. ఈ క్రమంలోనే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం స్పీకర్ ఓం బిర్లా వద్ద ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు.. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ, ఇండియా ఐక్యసంఘటన ఎంపీలతో కలిసి స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రాహుల్తో పాటు సమాజ్వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సిపి`ఎస్పి), కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ) తదితరులు ఉన్నారు. ‘‘ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన అనంతరం రాహుల్ గాంధీ ‘ఇండియా’ నేతలతో కలిసి తొలిసారి స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు పనితీరు గురించి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ ప్రస్తావన తీసుకురావడాన్ని రాహుల్ లేవనెత్తారు. ఇది రాజకీయపరమైన అంశమని, దీనిని నివారించి ఉండాల్సిందని చెప్పారు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు.. ఆయన కూడా స్పీకర్కు ఈ వ్యవహారంపై ఓ లేఖ రాశారు. ‘‘పార్లమెంట్ విశ్వసనీయతపై ప్రభావం చూపుతోన్న ఓ తీవ్రమైన అంశం నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాను. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీని మీరు ప్రస్తావించడం దిగ్భ్రాంతికరం. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ చూడనిది. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై కాంగ్రెస్ తరపున ఆందోళన వ్యక్తం చేస్తున్నాను’’ అని కేసీ వేణుగోపాల్ తన లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అనేకమంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. మీడియాపై ఆంక్షలు విధించింది. న్యాయ వ్యవస్థపైనా నియంత్రణలు అమలు చేసింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈ సభ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని హామీ ఇస్తున్నా’’ అని స్పీకర్ బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.