డా. ఎం సురేశ్ బాబు
ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. అతిసార వ్యాధిని అంగ్లభాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి సాధారణంగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే ‘డీసెంట్రీ’ అంటారు. పిల్లల్లో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వల్ల వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువసార్లు వదులుగా వీరేచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం అతిసారంవల్ల 7,60,000 మంది ఐదు సంవత్సరాల లోపు శిశువులు మరణిస్తున్నారు. సురక్షిత నీరు తాగుతూ, పరిశుభ్రత పాటించడం వలన అతిసార వ్యాధిని నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 1.7 బిలియన్ అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం అతిసారానికి ప్రధాన కారణం అవుతుంది. రోటా వైరస్, అస్ట్రో వైరస్, నార్ వ్యాక్ వైరస్, పికోర్నా వైరస్ మాములుగా కల్గిస్తాయి. డీసెంట్రీ కలిగించే బాక్టీరియాలు, ఈ.కోలై (హీమోరేజిక్ సబ్ స్పీసీస్ ఓహెచ్157), క్యామపైలోబ్యాక్టర్ జెజెనై, సాల్మొనెల్లా జాతులు, షిగెల్లా. ఇవన్నీ నీటి కలుశితాల ద్వారా సంక్రమిస్తాయి. శుద్ధిలేని నీటిలో ఈ వైరసులు వృద్ధి చెందుతాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, శుచి శుభ్రతలేని రెస్టారెంట్లు, ఏళ్ల్ల తరబడి శుభ్రం చేయని మంచినీటి ట్యాంకులు, కలుషిత ఆహారం డయేరియాకు ప్రధాన కారణం. ప్రజలకు మంచి ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు లేకపోవడం. నేటికీ సగటు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆర్థికంగా వెనకపడ్డ జిల్లాలు రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్యం ఎలా ఉందీ, వాళ్ల అవసరాలు, నిధుల కేటాయింపు జరిగిన దాఖలాలు ఎక్కడా లేదు. పట్టణ ప్రాంతాలలో కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పేదలకి అందని ద్రాక్ష, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక రోగిని వెక్కిరిస్తాయి. అసలు రోగి సమస్య ఏమిటి ఏ వైద్యం చేస్తున్నారు, చికిత్స తరువాత రోగి స్థితి ఏమిటి అన్నదే ప్రశ్న? నిండు గర్భిణి వచ్చినా నొప్పులు పడుతున్న తమకు పట్టదన్నట్లు జిల్లా ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు, జిల్లా ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవని వేరే ఆసుపత్రికి తీసుకు పోవాలని సూచిస్తారు. జిల్లా కేంద్రంలో వెలసిన సర్వజన ఆసుపత్రులలో గైనిక్ వార్డుల్లో ప్రతి మంచానికి ఇద్దరు గర్భిణీలు, ఇద్దరు బాలింతలు ఉంటున్నారు. అడ్మిషన్ అయిన గర్భవతులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలు, వీరిలో చాలమందికి రక్తహీనత ఉంటున్నది. గత రెండు సంవత్సరాలుగా కళాశాలల్లో రక్త సేకరణ జరగకపోవడంతో బ్లడ్ బ్యాంక్లో రక్తం కొరత ఉన్నది. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులే శరణ్యం. ఎంఆర్ఐ, సిటి స్కాన్ వసతి లేదు. గ్రామీణ ఏజెన్సీలలో పరిస్థితి మరీ దారుణం. సమయానికి వైద్యులు అందుబాటులో ఉండరు, మందులు ఉండవు. సీజన్ వస్తున్నా దోమతెరలు ఇవ్వరు. రోడ్డు ప్రమాదాలు జరిగిన అత్యవసర వైద్యం లేదా శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు ఉండరు. కనీసం పురుడు పోయడానికి డాక్టర్స్ ఉండరు. అక్కడ ఆరోగ్య కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవని ఒక ఆరోగ్య కేంద్రానికి ఒకే డాక్టర్ ఉన్నారు. కనీసం మందులు కూడా లేవని కేంద్రానికి నివేదిక ఇచ్చినా చేసింది లేదు. అటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేక సగటు మధ్య తరగతి ప్రజలకు మీరు చేసింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? చేయాలనీ అనుకున్నది ఏమిటి? రోగి కళ్యాణ్ సమితి (రోగి సంక్షేమ కమిటీ)/హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ ఒక సాధారణ సామర్థ నిర్వహణ వ్యవస్థ. ఈ కమిటీ, ఒక నమోదిత సంఘం. ఆస్పత్రులు వాటి వ్యవహారాలను చూసుకోవడానికి ట్రస్టీగా పనిచేస్తుంది. రోగి కళ్యాణ్ సమితి ద్వారా మందుల ఉత్పత్తి, సుళువైన పనితీరుకు అనుగుణంగా నిధులు పెంచడం, వాటిని ఉపయోగించడం చేయగలరు. పాలక మండలి సమావేశాలు త్రైమాసికంలో కనీసం ఒకసారి చైర్పర్సన్ నిర్ణయించిన సమయం, ప్రదేశంలో నిర్వహించాలి. ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్స్, ప్రోటోకాల్స్ అంగీకరించటం. గత త్రైమాసికంలో ఆసుపత్రి ఓపీడీ, ఐపీడీ సేవల పనితీరుల సమీక్ష, తరువాత త్రైమాసికంలో సేవా లక్ష్యాలు నిర్ణయించటం. పర్యవేక్షణ కమిటీ సమర్పించిన నివేదికలు సమీక్షించటం. నిధులు, పరికరాలు, ప్రభుత్వ వివిధ కార్యక్రమాల కింద అందుకున్న మందుల వినియోగ స్థితిని ఆన్లైన్లో సమీక్షించటం. సాధారణ అంశాలకు అదనంగా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చర్చ జరగని సొసైటీ వార్షిక నివేదిక కూడా త్రైమాసిక సమావేశంలో చర్చించాలి. ఇవన్నీ ఇప్పుడు నామమాత్రంగా ఉంటున్నాయి. ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం పరచాల్సిన బాధ్యత మనందరిది.