జవహర్రెడ్డి, మాలకొండయ్యకు పోస్టింగ్లు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా అతుల్ సింగ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. శుక్ర వారం ముగ్గురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీజేసింది. ప్రస్తుత ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్సింగ్ను ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించింది. శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమించింది. విశాఖ సీపీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ను సీఐడీ అదనపు డీజీగా ఉత్తర్వులు జారీజేసింది. ఇప్పటికే ఏపీ డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిం చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ముఖ్య అధికారు లను బదిలీ చేసింది. ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూశ్కుమార్
పూర్వపు సీఎస్ కేఎస్ జవహర్రెడ్డికి, పూనం మాలకొండయ్యకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. వారిద్దరూ ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. జవహర్రెడ్డిని ఈడబ్ల్యూఎస్ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను, పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీజేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎస్గా పనిచేసిన జవహర్రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. పూనం మాలకొండయ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ రావడంతో జవహర్రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జవహర్రెడ్డి తీసుకున్న అనేక వివాదస్పద నిర్ణయాలతో విమర్శలపాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను పక్కన పెట్టింది. దీంతో ఆయనకు ఇక పోస్టింగ్ ఉండదని అందరూ భావించారు. జవహర్రెడ్డికి, పూనం మాలకొండయ్యకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చి హుందాతనంగా వ్యవహరించింది. కాగా, ఇటీవల కేంద్రం నుంచి ఏపీ కేడర్కు వచ్చిన పీయూశ్కుమార్ను సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ఆర్థిక శాఖ (పీఎఫ్ఎస్) ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఎస్ రావత్ సెలవులో ఉండగా, ఆయన్ను రిలీవ్ చేయాలని ఆదేశించారు.