కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో సమీపంలో శనివారం (జూన్ 29న) ఘోర ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం,నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ నీటిలో చిక్కుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లడఖ్లోని ఎల్ఎసి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఐదుగురు ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నీటిలోంచి ఇప్పటి వరకు కొందరి మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..