జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : తాడిపత్రికి చెందిన కూచిపూడి కళాకారిణిలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం అనంతపురం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం తాడిపత్రి పట్టణంలోని వందన డాన్స్ అకాడమీకి చెందిన కూచిపూడి కళాకారిణిలైన సాయి మైత్రి, జ్యోషిత, వర్షిని, నవ్య, సాహిత్య, నిహారిక అనే ఆరుగురు విద్యార్థినీలు అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూచిపూడి కళాకారిణులను అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూచిపూడి కళలో నిష్ణాతులైన ఆరుగురు విద్యార్థినీలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్ వద్ద మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూచిపూడి డాన్స్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మరిన్ని రికార్డులు నమోదు చేయాలని, ఇలాంటి ఘనతలను మరిన్ని సాధించాలని, ఇందులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థినీలకు సూచించారు. ఈ సందర్భంగా వందన డాన్స్ అకాడమీకి చెందిన కూచిపూడి గురువు వందన భర్త ప్రవీణ్ మాట్లాడుతూ మే 13 న తాడిపత్రి వందన డాన్స్ అకాడమీకి చెందిన కూచిపూడి కళాకారిణిలైన సాయి మైత్రి, జ్యోషిత, వర్షిని, నవ్య, సాహిత్య, నిహారిక అనే ఆరుగురు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్ ఆలయం వద్ద మైనస్ 2 డిగ్రీల చలిలో ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు గంటన్నర పాటు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారన్నారు. అంతకుముందు రోజు 25 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా ప్రయాణం చేసి కేదార్ నాథ్ ఆలయం వద్దకు 19 గంటల వ్యవధిలో చేరుకోవడం జరిగిందన్నారు. కేదార్నాథ్ ఆలయం వద్ద మైనస్ 2 డిగ్రీల చలిలో కూచిపూడి నృత్యం ప్రదర్శించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు కావడం జరిగిందన్నారు. ఈ విషయమై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందించడం జరిగిందని తెలిపారు. అలాగే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు నమోదు కావడం జరిగిందని మెయిల్ వచ్చిందన్నారు. భవిష్యత్తులో కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) వద్ద కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించేందుకు తాము సన్నద్ధం కావడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీలో కూడా కూచిపూడి నృత్యం ప్రదర్శించడం జరిగిందన్నారు. విద్యార్థినీలను అభినందించడం పట్ల జిల్లా కలెక్టర్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్డివో షఫీ, తదితరులు పాల్గొన్నారు.