పోలవరంపై చంద్రబాబుకు రామకృష్ణ విజ్ఞప్తి
విశాలాంధ్ర-తిరుపతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను ముఖ్యంత్రి నారా చంద్రబాబునాయుడు సాధించాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.30 వేల కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఈ పరిహారం నిర్వాసితులకు ఇప్పించడానికి ఏపీ ప్రభుత్వం కృషి చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ విమర్శించారు. నిర్వాసితులకు పరిహారంపై మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయం సీఎం చంద్రబాబునాయుడు గుర్తించాలని రామకృష్ణ సూచించారు. పోలవరం నిర్మాణానికి చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు పోలవరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిశాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను గతంలో జగన్ మార్చడం, రివర్స్ టెండరింగ్కు వెళ్లడం వలన చాలా నష్టం జరిగిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
రివర్స్ టెండరింగ్ వలన పోలవరం నిర్మాణం విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. జగన్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబుకు పోలవరంపై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. వారిద్దరూ మాటలతోనే కాలం గడిపేచారని రామకృష్ణ చెప్పారు. పోలవరంపై అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని రామకృష్ణ అభిప్రాయ పడ్డారు. పోలవరం విషయంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడరాదని సూచించారు. నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. అపుడే చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని రామకృష్ణ చెప్పారు.