. రాజ్యాంగంపై దాడి
. ప్రశ్నించేవారిపైనా దాడులు
. ‘ఇండియా’ నేతలపై అక్రమ కేసులు
. నాపైనా 20 కేసులు… 55 గంటలు ప్రశ్నించారు
. ప్రధాని మోదీ, బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్
న్యూదిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. హిందువులంటే హింసను, ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారు కాదని…కానీ హిందువులుగా చెప్పుకుంటున్న కొందరు హింస, ద్వేషాన్ని రగిలించడంతోపాటు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, అధికార బీజేపీ ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని చెప్పారు. తనపైనా వ్యక్తిగతంగా దాడి జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. కొందరు నేతలు ఇప్పటికీ జైలులో ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తనపై 20 కేసులు నమోదయ్యాయని, తనకు ఇచ్చిన ఇంటిని కూడా లాగేసుకున్నారన్నారు. ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) 55 గంటలకుపైగా తనను ప్రశ్నించిందని వివరించారు. మహా శివుని ఫొటో చూపిస్తూ… అన్ని మతాలు ధైర్యంగా ఉండమనే ప్రబోధిస్తున్నాయని రాహుల్ వివరించారు. అయితే హిందువులుగా చెప్పుకుంటున్న వారు 24 గంటలూ కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, మీరు అసలు హిందువులేనా? అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని రాహుల్ బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘భారత చరిత్రలో 3 మూలస్తంభాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. మోదీ ఒకసారి మాట్లాడుతూ భారత్ను ఎవరూ ఆక్రమించలేరని చెప్పారు. అందుకు కారణం ఉంది. మన దేశం అహింసా దేశం. ఈ దేశం భయపడే దేశం కాదు. మన మహాపురుషులందరూ అహింస గురించే చెప్పారు. భయం వద్దన్నారు. భయం వద్దు, భయపడొద్దన్నారు. ఇంకోవైపు మహాశివుని రూపాన్ని చూస్తే భయం వద్దు, భయపడొద్దని చెబుతోంది. ఆయన అభయ హస్తం అహింస గురించి మాట్లాడితే శూలంతో పొడుస్తామంటుంది. ఎవరైతే హిందువుగా చెప్పుకుంటున్నారో వారు 24 గంటలూ హింస, హింస, హింస అంటున్నారు. ద్వేషం, ద్వేషం. అసత్యం, అసత్యం, అసత్యం. మీరు హిందువులే కాదు. హిందూ ధర్మం సత్యమే చెప్పమంటోంది. సత్యాన్ని దాచవద్దని, సత్యం చెప్పడానికి భయం వద్దంటుంది. అహింసే మా విధానం. అదే అభయముద్ర’ అని అన్నారు రాహుల్ గాంధీ.
మోదీ అభ్యంతరం…రాహుల్ కౌంటర్
ఈ విధంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ… ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజం మొత్తాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదులిస్తూ.. ‘‘నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదు, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదు’’ అని బదులిచ్చారు. తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని.. మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.
శివుని ఫోటో నిషేధమా?
అంతకుముందు.. రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో ప్లకార్డ్లు, ఫొటోలు ప్రదర్శించడం నిషేధం అని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్ బదులిస్తూ… ఈ సభలో శివుని బొమ్మని చూపించడం నిషేధమా? అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టిముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే… ఆ త్రిశూలం కుడిచేతిలో ఉండేదని రాహుల్ గాంధీ తెలిపారు. తాను శివుని నుంచే ప్రేరణ పొందానని, ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటామని, అధికారం కంటే నిజం గొప్పదని చెప్పారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ, సీబీఐ తమ ఇండియా కూటమి నేతలను వేధింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.
సంపన్నుల బిడ్డలకే ‘నీట్’
నీట్ పరీక్ష లోటుపాట్లపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నీట్ విద్యార్థులు పరీక్ష కోసం ఏళ్ల తరబడి సన్నద్ధమయ్యారని, వారి కుటుంబాలు ఎంత కష్టమైనా విద్యార్థులకు ఆర్థికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచాయని అన్నారు. నీట్ పరీక్ష ధనవంతులను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారని, ప్రతిభ కల విద్యార్థుల కోసం కాదని వారికి అర్థమవడంతో పరీక్షపైనే విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. తాను కొంతమంది నీట్ విద్యార్థులను కలిశానని, సంపన్నులు సులభంగా పాస్ అయ్యేలా వారి కోసం కోటాను సృష్టించేలా పరీక్షను డిజైన్ చేశారని సదరు విద్యార్థులు తనతో చెప్పారని పేర్కొన్నారు. నీట్ పరీక్షను పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా మలిచేలా డిజైన్ చేయలేదని వారు వాపోయారని తెలిపారు.
రాహుల్ క్షమాపణ చెప్పాలి: అమిత్షా
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుబట్టారు. హిందువులందరినీ హింసావాదులుగా అభివర్ణించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మీ(స్పీకర్) మార్గదర్శకాలు తర్వాత కూడా మొత్తం బీజేపీ హింసను ప్రేరేపిస్తుందని చెప్పడం, ఒకరికొకరి మధ్య అగ్గిరాజేసేలా మాట్లాడుతున్నారు. నియమాలు ఆయనకు వర్తించవా? నియమాలు గురించి తెలియకపోతే చెప్పండి. సభ ఇలా జరగకూడదు. మీరు సభను ఆర్డర్లో పెట్టండి, నియమాలకు అనుగుణంగా జరగాలని మా సభ్యులందరూ మిమ్మల్ని (స్పీకర్ను) కోరుతున్నారు’ అని చెప్పారు.