పి.డి.ఎస్.ఓ
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) : తే.04.07.2024ది. నీట్ ప్రవేశ పరీక్ష, యూజిసి నెట్ లీకేజీలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘం పి.డి.ఎస్.ఓ. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం తలపెట్టిన విద్యా సంస్థల బంద్ చోడవరంలో విజయవంతమైంది.
చోడవరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి కొత్తూరు వరకు ర్యాలీ, మానవహారం చేసారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.ఓ.బిరాష్ట్ర అధ్యక్షులు ఎన్. భాస్కర్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ఒక రోజు ముందే ప్రశ్నా పత్రం సోషల్ మీడియాకు లీక్ కావడం, ముందుగా ప్రకటించిన ఫలితాలు తేదీ జూన్ 14 కంటే ముందు నాలుగో తేదీన అంటే దేశ ఎన్నికల ఫలితాలు రోజు విడుదల చేయడం, ఇప్పటివరకు ఎప్పుడు రానటువంటి విధంగా 67 మందికి 720 కి 720 మార్కులు రావడం వారిలోనూ ఆరుగురు ఒకే సెంటర్ విద్యార్థులు కావడం ఇవన్నీ కూడా నీట్ ఎగ్జాం స్కామ్ జరిగిందని చెప్పడానికి నిదర్శనాలుగా ఉన్నాయిన్నారు. కాబట్టి నీట్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, నీట్ పరీక్ష నిర్వహించడంలో జరిగిన స్కాములపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత పూర్తిస్థాయిలో సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రీకరణను, కార్పొరేట్లను ప్రోత్సహిస్తున్న నీట్, సి.ఈ.యు.టి తరహా పరీక్షలను రద్దు చేయాలని, ఈ నీట్ పరీక్షల స్కాంపై ఏ.పి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విద్య ప్రవేశ పరీక్షను రాష్ట్రాలే నిర్వహించేటట్లు చూడాలని, దేశవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ఇప్పటి వరకు జరిగిన పేపర్ లీకేజీలు, స్కామ్ లపై సమగ్రమైన విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ అనకాపల్లి జిల్లా కో – కన్వీనర్ ఎ.మౌనిక , సభ్యులు వై.ధరణి, బి.రాజేష్, రామకృష్ణ, పి. వంశీ, టి.అర్జున్ మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.