మూడవసారి బాధ్యతలు
రాంచీ : జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం రాజ్ భవన్లో సోరెన్తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సోరెన్ కుటుంబ సభ్యులతో పాటు జేఎంఎం నేతృత్వ కూటమి సీనియర్ నాయకులు హాజరయ్యారు. మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సోరెన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాజీనామాతో హేమంత్ సోరేన్కు మార్గం సుగమమైంది. గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కోరుతూ, సంబంధిత మద్దతు లేఖను ఆయన సమర్పించారు. గవర్నర్ అంగీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు హేమంత్ సోరెన్ను ఆహ్వానించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగలిగారు.
నిబద్ధతతో పనిచేస్తా…
ప్రజాదరణ, కోర్టు తీర్పుతో జైలు నుంచి బయటకు రాగలిగానని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సంక్షోమ పథంలో నడిపిస్తానని, సమర్థ సేవలు అందిస్తానని, నిబద్ధతతో పనిచేస్తానని హేమంత్ సోరెన్ హామీనిచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత మాట్లాడిన ఆయన… తన అరెస్టు తర్వాత రాష్ట్ర పగ్గాలు చేపట్టిన చంపై సోరెన్ను ప్రశంసించారు. విధి ధర్మానానికి కట్టుబడ్డారని, సమర్థంగా పనిచేశారంటూ అభినందించారు. చంపై సోరెన్ కూడా హేమంత్ సోరెన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రజలకు హేమంత్ ఒక వీడియో సందేశమిచ్చారు. తనపై జరిగిన కుట్ర, ఐదు నెలలు జైల్లో ఉండటం గురించి మాట్లాడారు. ‘జనవరి 31న నన్ను అరెస్టు చేశారు. నాపై జరిగిన కుట్ర గురించి మీకు తెలుసు. నన్ను జైలుకు పరిమితం చేయాలని చూశారు కానీ న్యాయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకున్నా. వీధుల్లోకి వచ్చి మీరు కూడా మద్దతిచ్చారు. చివరకు న్యాయం జరిగింది. నాపై ఆరోపణలు కొట్టివేశారు’ అని హేమంత్ సోరెన్ అన్నారు.
ప్రజల ఆశీర్వాదంతోనే: కల్పన
హేమంత్ సోరెన్ భార్య, జేఎంఎం శాసనసభ్యురాలు కల్పనా సోరెన్ మాట్లాడుతూ హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించగలగడం ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతోనే సాధ్యమైందని చెప్పారు. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల బయటకు రాగలి సీఎం పగ్గాలను హేమంత్ సోరెన్ చేపట్టగలిగారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి మునుపటి కంటే మెరుగైన పాలనను అందించేందుకు కృషి చేస్తారు’ అని కల్పన అన్నారు.
జేఎంఎం సారథ్యంలోని ఇండియా ఐక్య సంఘటన ఎమ్మెల్యేలంతా చంపై సోరెన్ నివాసంలో బుధవారం సమావేశమై హేమంత్ సోరెన్ను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈనెల 7న ప్రమాణ స్వీకారం జరుగుతుందని జేఎంఎం తొలుత ప్రకటించింది కానీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబరులో వెలువడే అవకాశం ఉన్నందున నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక హేమంత్ సోరెన్ కేబినెట్పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం జరగలేదు. కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ మాట్లాడుతూ తమ పార్టీ తరపున కేబినెట్లో ఎవరుండానేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 పార్లమెంటు స్థానాలలో తొమ్మిది ఎన్డీయే గెలిచింది. ఇండియా ఐక్య సంఘటన ఐదు స్థానాలకు పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఉప-ఎన్నికల్లో జేఎంఎం సత్తా చాటింది. గాండే స్థానం నుంచి కల్పనా సోరెన్ ఎన్నికయ్యారు. హేమంత్ సోరెన్ కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో హేమంత్ సోరెన్ను నాటకీయ పరిణామాల నడుమ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం విదితమే.
8న బలపరీక్ష
హమంత్ సోరెన్ అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన జార్ఖండ్ ప్రభుత్వం ఈనెల 8న బలపరీక్షను ఎదుర్కోబోతోంది. జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సోరెన్ సర్కార్ సిద్ధమెనట్లు జేఎంఎం వర్గాలు వెల్లడిరచాయి. గెలుపుపై దీమా వ్యక్తంచేశాయి.