రిషి సునాక్ నాయకత్వంలో కన్జర్వేటివ్లకు ఘోర పరాజయం
ప్రతిపక్ష లేబర్ పార్టీకి అధికారం కట్టబెట్టిన బ్రిటన్ ప్రజలు
మొత్తం 650 స్థానాలకు గానూ 400 చోట్ల విజయం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ప్రతిపక్ష లేబర్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో.. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బట్టి లేబర్ పార్టీ 354 స్థానాల్లోనూ.. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 74 స్థానాల్లోనూ విజయం సాధించాయి. దీంతో ఓటమిని అంగీకరించిన భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. ప్రజల తీర్పును శిరసావహిస్తామని ప్రకటించారు. ఈ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టు తన మద్దతుదారులను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ రోజు అధికారం శాంతియుతంగా.. ప్రజాస్వామ్యబద్దంగా అన్ని వైపులా సద్భావనతో మార్పిడి జరుగుతుంది… అది మన దేశ స్థిరత్వం.. భవిష్యత్తుపై మనందరికీ విశ్వాసం కలిగించే విషయం… నన్ను క్షమించండి.. ఓటమికి నేను బాధ్యుణ్ని అని అన్నారు. లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మేర్ తదుపరి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు.. మార్పు ఇక్కడే మొదలువుతుంది అని అన్నారు. బ్రెగ్జిట్, దశాబ్దకాలంగా కొనసాగుతోన్న జీవన వ్యయ సంక్షోభం నుంచి ఉపశమనం కల్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు. అయితే, వీటి నుంచి బయటపడటం ఆయన హామీ ఇచ్చినంత సులభం కాదు. గత 14 ఏళ్లుగా బ్రిటన్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడింది. గత ఎన్నికల్లో 348 స్థానాలను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి 100 లోపు సీట్లకే పరిమితమయ్యేలా ఉంది. 2016 నుంచి ఐదుగురు ప్రధానులు మారడం, దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అలాగే, ఆరు నెలల గడువు ఉండగానే ఎన్నికలకు వెళ్లడం కూడా తొందరపాటు చర్యే. రిషి సునాక్ నిర్ణయంపై సొంత పార్టీ నాయకులే తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఒపీనియన్ పోల్స్లో కన్జర్వేటివ్ పార్టీ 20 పాయింట్ వెనుకబడటం గమనార్హం.