అయోధ్యలా గుజరాత్లోనూ బీజేపీని ఓడిస్తాం
అహ్మదాబాద్ సభలో రాహుల్ ఉద్ఘాటన
అహ్మదాబాద్: గుజరాత్లో 30 ఏళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఇదే రాష్ట్రం నుంచి కొత్తగా ప్రారంభిస్తా మని ప్రకటించారు. దశాబ్దాల కాషాయ పార్టీ పాలనకు ముగింపు పలకబోతున్నామని, అయోధ్యలో ఓడిరచినట్టే గుజరాత్లోనూ బీజేపీని, నరేంద్రమోదీని ఓడిస్తామని రాహుల్ అన్నారు. ‘రాసిపెట్టుకోండి… గెలుపు మనదే’ అంటూ నినాదించారు. రాహుల్ శనివారం గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్లో పార్టీ కార్యకర్తల సభలో పాల్గొన్నారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జీపీసీసీ) కార్యాలయం వద్ద బీజేపీకి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ గురించి మాట్లాడారు. ‘వాళ్లు (బీజేపీ) మనకు సవాల్ విసిరారు. మనల్ని బెదిరించారు. మన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇక మన వంతు. వాళ్లు మన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు రాష్ట్రంలోని వారి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం. గుజరాత్లోనూ బీజేపీకి, మోదీకి ఓటమి తప్పదు’ అని రాహుల్ అన్నారు. అయోధ్య నుంచి పోటీ చేసేందుకు మోదీ ప్రయత్నించారని, క్షేత్రస్థాయి పరిస్థితులపై సర్వేలు నిర్వహించారని, ప్రతికూల పరిస్థితులను గ్రహించి వారణాసి నుంచి స్వల్ప మెజారిటీతో గెలిపి పరువు దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా ఐక్య సంఘటన చేసిన చిన్న పొరపాట్ల వల్ల వారణాసిలో మోదీ గెలవగలిగారన్నారు. అయోధ్యలో బీజేపీని ఓడిరచడం ద్వారా ఆ పార్టీ సీనియర్ నేత అడ్వాణి ప్రారంభించిన రామ మందిరం ఉద్యమాన్ని ఇండియా ఐక్య సంఘటన ఓడిరచిందని రాహుల్ నొక్కిచెప్పారు. ‘మీకు అభయముద్ర (కాంగ్రెస్ గుర్తు) అండగా ఉంటుంది. ఎవరూ భయపడవద్దు. ధైర్యంగా ఎదిరిస్తే మిమ్మల్ని భయపెట్టే బీజేపీ కనుమరుగవుతుంది. ఇదే గుజరాత్ ప్రజలకు నేనిచ్చే సందేశం’ అని అన్నారు. మోదీ గుజరాత్ ‘విజన్’ అనే బూరలోని గాలి తీసేస్తామని వ్యాఖ్యానించారు. తాను అవతార పురుషిడినని నమ్మే వ్యక్తి… కార్మికుల, కర్షకుల బాధలు, వజ్ర పరిశ్రమల్లో పనిచేసే వారి వెతలు అర్థం చేసుకోలేని వ్యక్తి… గుజరాత్ ప్రజల కోసం విజన్ ఎలా అందిస్తార’ని రాహుల్ ప్రశ్నించారు. ‘30ఏళ్ల తర్వాత గుజరాత్లో ప్రజా ప్రభుత్వం (కాంగ్రెస్`ఇండియా కూటమి అధ్వర్యంలో) ఏర్పాటు కాబోతోంది. నేను, నా సోదరితో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంటా మీకు వెన్నెంటే ఉంటారు’ అని అన్నారు. బీజేపీని ఓడిరచడమే లక్ష్యంగా కలిసి కట్టుగా ముందుకెళదామని గుజరాత్ ప్రజలకు పిలుపు నిచ్చారు. బీజేపీలో నిరంకుశత్వం ఉన్నదని, మోదీ అంటే అందరికీ భయమని… తమ అభిప్రాయాలను వ్యక్తంచేసే ధైర్యం ఆ పార్టీ నేతల్లో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో కింది స్థాయి కార్యకర్త కూడా అధిష్ఠానం ముందరకు వచ్చి నిర్భయంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఇటువంటి ఒక కార్యకర్త కాంగ్రెస్లో రెండు రకాల గుర్రాలు ఉన్నాయని… అవి గెలుపు గుర్రాలు, పెళ్లిల్లో పాల్గొన్నే గుర్రాలని, పార్టీ రేసు గుర్రాలను పెళ్లిళ్లకు, పెళ్ళిళ్ల గుర్రాలను పందాలకు పంపుతున్నదని తమ దృష్టికి తెచ్చినట్లు రాహుల్ చెప్పారు. 2017లో మూడు నెలలు శ్రమిస్తే మంచి ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు మూడేళ్ల సమయం ఉందని, పోటీలో గెలుపు తమదే కాబోతోందని దీమాగా చెప్పారు.